నిర్మలకు తెలియకుండా, జీవీఎల్ సన్నాసి: మోడీపై కుటుంబరావు షాకింగ్, కేశినేని ఆగ్రహం
అమరావతి: బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావుపై ఆదివారం టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు, టీడీపీ ఎంపీ కేశినేని నాని తదితరులు మండిపడ్డారు. జీవీఎల్ సన్నాసిలా మాట్లాడుతున్నారని, ఆయనను సన్నాసి అని చెప్పుకోవచ్చునని కుటుంబరావు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
సరైన టైంలో చెప్తా, జగన్ వల్ల బాధపడ్డా: పవన్ 'సింగపూర్'పై బాబు కౌంటర్
జీవీఎల్ చేసినవి అన్నీ తప్పుడు ఆరోపణలే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అంతా పారదర్శకుంగా ముందుకు సాగుతోందన్నారు. అవినీతి అనుమానాలు ఉంటే ఆయన సీవీసీకి ఫిర్యాదు చేసుకోవచ్చునని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి లేదన్నారు. 17 యూనివర్సిటీలకు సంబంధించి కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
కేంద్రంపై కూడా కాగ్ చెప్పింది
కేంద్రం పైన కూడా కాగ్ ఎన్నో చెప్పిందని కుటుంబ రావు గుర్తు చేశారు. పీడీ అకౌంట్ల గురించి జీవీఎల్ అర్థం చేసుకోక మాట్లాడుతున్నారన్నారు. ఉత్తర ప్రదేశ్ గురించి ఆయన మాట్లాడితే బాగుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెప్పడం సరికాదన్నారు. ఎస్సార్ ఆయిల్ పైన కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఎస్సార్ ఆయిల్ స్కాంలో మనీలాండరింగ్ జరిగిందన్నారు.
నిర్మలకు తెలియకుండా.. తీవ్ర ఆరోపణలు
జీవీఎల్ ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని, ఆయన అక్కడ చూసుకుంటే బావుంటుందని కుటుంబ రావు అన్నారు. ఇక్కడ ఏపీకి కూడా రాజ్యసభ సభ్యులు ఉన్నారని, వారు చూసుకుంటారని చెప్పారు. రాఫెల్ స్కాం రక్షణ శాఖమంత్రి నిర్మలా సీతారామన్కు కూడా తెలియకుండా జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి (నిర్మల)తో సంబంధం లేకుండా ప్రధాని కార్యాలయం ఈ వ్యవహారం నడిపిందని ఆరోపించారు.
ఆధార్ కార్డులేనివాడు ఆంద్రా గురించి మాట్లాడటమా?
జీవీఎల్ ఏపీకి వచ్చి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. కేశినేని చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జీవీఎల్కుఅసలు ఏపీలో అడ్రెస్ లేదన్నారు. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఎక్కడ ఉందో ఆయనకే తెలియదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే పార్లమెంటుకు ముప్పు వస్తుందని విమర్శిస్తున్న జీవీఎల్కు గతంలో పార్లమెంట్ దగ్గర మోడీ క్యాండిల్ ర్యాలీ చేసినప్పుడు పార్లమెంట్కు ముప్పు వస్తుందని కనిపించలేదా? అన్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తుని జీవీఎల్ ఆరోపిస్తున్నారని, దానిని ఆధారాలతో నిరూపించగలరా అని కేశినేని నాని సవాల్ చేశారు. ఆధార్ కార్డు లేనివాడు ఆంధ్రా గురించి మాట్లాడటమా అన్నారు.
ఏపీలో కాగ్, కామన్వెల్త్ కంటే పెద్ద స్కాంలు
కాగా, తాత్కాలిక వ్యక్తిగత ఖాతాల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని జీవీఎల్ శనివారం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ విచారణను కోరి, నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. 2017-18లో 58,414 తాత్కాలిక ఖాతాలు తెరిచి అందులో 53,039 కోట్ల రూపాయలను టీడీపీ ప్రభుత్వం మళ్లించిందన్నారు. వీటిలో సగం మొత్తం ఇప్పటికే ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. 2జీ, బొగ్గు, కామన్వెల్త్ కుంభకోణాల కంటే ఇది ఎక్కువగా ఉందన్నారు. కాగ్ 2017-18 నివేదికలో ఏపీ ప్రభుత్వం గురించి ప్రస్తావించిందన్నారు. రూ.లక్ష కోట్లకు పైగా రాష్ట్రప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ కుంభకోణాన్ని జాతీయస్థాయిలో వెలుగులోకి తెస్తామన్నారు.