జగన్ది దుర్మార్గపు పాలన, జీవీఎల్ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం: కేశినేని నాని, వడ్డే శోభనాద్రీశ్వరరావు
విజయవాడ: అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని విజయవాడలోని ఆటోనగర్లో ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభించారు.
ఉద్యమాన్ని అణిచివేస్తున్నారు..
ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, సీపీఐ నేత రామకృష్ణ, జనసేన నేత బత్తిన రాము తదితరులు పాల్గొననారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. పోలీసులపైకి నెపంనెట్టి అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసుల పేరుతో రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు.
దుర్మార్గపు పాలన.. జీవీఎల్ వ్యాఖ్యలకు ఖండన
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఇలాంటి దుర్మార్గపు పాలన తాము ఎన్నడూ చూడలేదని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజధాని విషయంలో రాష్ట్రానికి ఎంత సంబంధం ఉందో.. కేంద్రానికి కూడా అంతేగా బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు. రాజధానిపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు.
చేతిగాని నిర్ణయాలు.. జాతీయ సమేశంలో...
అంతకుముందు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. అమరావతి కేవలం రాజధాని గ్రామాల సమస్య కాదని, 5 కోట్ల ఆంధ్రుల సమస్య అని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం చేతగాని నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. కొన్ని కుటుంబాలు, వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చారరని ఆరోపించిన ఆయన.. ఇది జాతీయ సమస్యగా పరిగణించబోతోందని అన్నారు.
కేంద్రం జోక్యం చేసుకోవాలి..
రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలన్నారు. విజయవాడ ఉద్యమాలకు కేంద్రం అని, నూటికి నూరు శాతం విజయం సాధించి తీరుతామని వడ్డే శోభనాద్రీశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. రెండు నెలలుగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారని సీఎం జగన్పై అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు. నిరసన తెలిపేవారిని గూండాలుగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు.