‘బాబుపై ఆ 3 పార్టీల కుట్ర, కాళ్లు పట్టుకుంటారా? కేంద్రంలోనూ మాదే అధికారం’
విజయవాడ: రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ కేంద్రం, బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని. కాంగ్రెస్ పార్టీ విభజన చేసి కట్టుబట్టలతో రోడ్డున పడేస్తే... ఇప్పడు బీజేపీ కూడా అదే తరహాలో వ్యవహరిస్తోందని విమర్శించారు.
రాజకీయ ప్రయోజనాలను పణంగా పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో జత కట్టామని.. ఇప్పుడు కేంద్రంతో రాష్ట్రం యుద్దం చేస్తోందని కేశినేని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా రూపొందించిన పోస్టర్లను ఆయన ఆదివారం ఆవిష్కరించారు.
ఏపీ.. గుజరాత్ని మించుతుందనే..
ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని నాని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు.. వాటి వినియోగానికి సంబంధించిన లెక్కలన్నీ పారదర్శకంగా ఉన్నాయన్నారు. కేవలం రూ.1500 కోట్లతో ఢిల్లీని మించిన రాజధాని నిర్మాణం జరుగుతుందా..? అని నాని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధి జరిగితే గుజరాత్ను మించిపోతుందని మోడీ-షా అసూయ పడుతున్నారని అన్నారు. 12 కేసుల మాఫీకి జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడని.. అందుకే రాజీనామాలు పేరుతో డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు.
మోడీ, జగన్ కుట్రలు
రాష్ట్రాల నుంచి వస్తోన్న ఆదాయాన్ని కేంద్రం ఎన్నికలు జరుగుతోన్న రాష్ట్రాలకు మళ్లిస్తోందని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా కేశినేని నాని మండిపడ్డారు. ఎంపీలు రాజీనామాలు చేస్తే ఒరిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ఎంపీలు కేంద్రంలో, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో హోదా, ప్రయోజనాల కోసం పోరాడాలని అన్నారు. ఏపీనీ, బాబును ఇబ్బందులకు గురిచేసేందుకే బీజేపీ, జగన్ పార్టీలు కుట్ర పన్నాయని ఆరోపించారు. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు లక్షల కోట్లు సంపాదించాడని జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
జగన్.. ప్రధాని ఇంటిముందు ధర్నా చెయ్
టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పడుతుందని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రజలపై నిజంగా ప్రేమే ఉంటే ఢిల్లీలో ప్రధాని ఇంటిముందు ధర్నా, అమరణ నిరాహారదీక్ష చేయాలని డిమాండ్ చేశారు.
ఆ మూడు పార్టీల కుట్ర
ప్రధాని నరేంద్ర మోడీకి తన ప్రభుత్వంపై నమ్మకం లేదని అందుకే అవిశ్వాసంపై చర్చకు రావడం లేదన్నారు. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని అరోపించారు. కేంద్రం ఏపీ ప్రజలకు న్యాయం చేయాలని ఎన్డీయేతో నాలుగేళ్లు కలిసి పనిచేసినట్లు చెప్పారు. ప్రతిపక్షం అఖిలపక్షంలోకి వచ్చి ప్రజలకు న్యాయం చేసేలా వ్యవహారించాలన్నారు. జగన్ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన నరేంద్ర మోడీని వదిలేసి సీఎం చంద్రబాబును తిట్టడంలో ఆంతర్యమేంటని నిలదీశారు.
గుజరాతీల కాళ్ల మీద పడతారా?.. కేంద్రంలోనూ..
ఇది ఇలా ఉండగా, ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ.. ఏపీ బీజేపీ నేతలు ఇక్కడి ప్రజల పక్షమా..? మోడీ పక్షమా? అనేది తేల్చుకోవాలని బోండా అన్నారు. నాలుగేళ్లుగా టీడీపీని పొగిడిన బీజేపీ నేతలు ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నాలుగేళ్ళలో టీడీపీ పేరు చెప్పి బీజేపీ నేతలు అవినీతికి పాల్పడ్డారేమోనన్న అనుమానాలు తమకు వస్తున్నాయన్నారు. గుజరాతీల కాళ్ల మీద పడకుండా ఏపీ బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు. ఢిల్లీని ఢీకొంటామని.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ అధికారం తమదేనని అన్నారు. గుజరాత్ అల్లర్ల వ్యవహరంలో చంద్రబాబు మైనార్టీ పక్షాన నిలబడినందుకు ఏపీపైనా, చంద్రబాబు పైనా మోడీ కక్ష కట్టారని మండలి విప్ బుద్దా వెంకన్న అన్నారు.