కేసీఆర్కు చేతకాక, చంద్రబాబుకు ఏం సంబంధం: కేశినేని నాని
విజయవాడ: తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఏపీ టిడిపి ఎంపీ కేశినేని నాని గురువారం నాడు తీవ్రంగా మండిపడ్డారు.
హైకోర్టు విభజనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయవ్యవస్థనే తప్పుబట్టే విధంగా మాట్లాడుతున్నారన్నారు. న్యాయమూర్తులకు ప్రాంతీయతత్వం అంటగట్టడం ఏమాత్రం సరికాదన్నారు. హైకోర్టు విభజనకు, చంద్రబాబు సంబంధం ఏమిటో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. సొంత ప్రాంతం నుంచే పాలన కొనసాగించేందుకు అన్ని శాఖలను తరలిస్తున్నందును ఇంకా తెలంగాణపై ఆధారపడాల్సిన పని తమకు లేదని చెప్పారు.
ముగిసిన సీఎం చంద్రబాబు చైనా పర్యటన
సీఎం చంద్రబాబు బృదం చైనా పర్యటన గురువారం ముగిసింది. చివరి రోజు పర్యటనలో భాగంగా జిజోలో ఏర్పాటు చేసిన ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల పోత్సాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. దాదాపు 200కు పైగా చైనా పెట్టుబడి దారుల కంపెనీలు హాజరయ్యాయి.
ఏపీ పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర సమర్థతలపై చంద్రబాబు బృందం లఘుచిత్ర ప్రదర్శన ఇచ్చింది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీలో గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రపంచంలోని 10 అత్యుత్తమ రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలుపుతామన్నారు. రాజధాని నిర్మాణం నమూనా చాలా బాగుందన్నారు. జిజో నుంచి చంద్రబాబు బృందం హాంకాంగ్ మీదుగా ఢిల్లీ చేరుకోనుంది.