నువ్వొద్దురా పో అంటే..: చంద్రబాబు-చిరంజీవిలపై కేశినేని నాని
వ్యక్తిగతంగా చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని, కానీ రాజకీయ పార్టీని మాత్రం నడిపించలేకపోయారని టిడిపి ఎంపి కేశినేని నాని అన్నారు. ఓ ఛానల్ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు.
విజయవాడ: వ్యక్తిగతంగా చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని, కానీ రాజకీయ పార్టీని మాత్రం నడిపించలేకపోయారని టిడిపి ఎంపి కేశినేని నాని అన్నారు. ఓ ఛానల్ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు.
టిడిపిలోకి రాకముందు మూడు నెలల పాటు తాను ప్రజారాజ్యంలో పార్టీలో ఉన్నానని చెప్పారు. ప్రజారాజ్యాన్ని వీడిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని తనకు అనిపించలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబే మళ్లీ తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్నారు.
చంద్రబాబు ఏం చెప్తే అదే.
చంద్రబాబు ఆదేశాలను తాను శిరసావహిస్తానని, చివరి వరకు ఆయనతోనే ఉంటానని కేశినేని నాని చెప్పారు. ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయమంటే చేస్తానని. నువ్వొద్దురా పో అంటే, వెళ్లిపోయి కార్గో వ్యాపారం చూసుకుంటానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారే అవకాశమే లేదన్నారు.
జగన్ కలలు కంటున్నారు
ముఖ్యమంత్రి అవుతానని వైసిపి అధినేత జగన్ కలలు కంటున్నారని, అయితే, ప్రజలు మాత్రం ఆయనను పట్టించుకోవడం లేదని కేశినేని అన్నారు. రవాణా శాఖ అధికారులతో గొడవపై మాట్లాడుతూ.. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. ఒక ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడని, దాని గురించి తాను అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
ఆరేంజ్ ట్రావెల్స్ పైన..
ప్రమాదానికి గురైన బస్సు తప్పుడు బస్సు అని తనకు తెలుసునని, అందుకే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇచ్చే ఒక కాపీని ఇవ్వాలని తాను అడిగానని కేశినేని చెప్పారు. ఆ బస్సు ఆరంజ్ ట్రావెల్స్కు చెందినదని తెలిపారు. ఆరంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కడప నుంచి కృష్ణా జిల్లాకు వచ్చి, ఆ తర్వాత నిజామాబాద్కు వలస వెళ్లాడని చెబుతుంటారని తెలిపారు. ఈసారి నిజామాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేస్తాడని కూడా కొందరు చెబుతున్నారన్నారు.
అన్నీ అక్కడి రిజిస్ట్రేషన్వే..
తెలంగాణలో ఉన్నప్పుడు కవిత మనిషినని చెప్పుకుంటారని, ఏపీకి వచ్చినప్పుడు మరో విషయం చెబుతారని కేశినేని ఆరోపించారు. రెండు మూడేళ్ల నుంచే అతను ట్రావెల్స్ వ్యాపారంలో కనపడుతున్నాడని, ఈ మధ్య కాలంలో తన ట్రావెల్స్ను 180 బస్సులకు పెంచాడని, ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్లేనని చెప్పారు.
క్రైం చేయడం బాగా తెలుసు
క్రైం చేయడం అతనికి బాగా తెలుసని, పన్నులు కట్టకుండా బస్సులు తిప్పుతున్నారని కేశినేని ఆరోపించారు. తన వల్ల పార్టీకి ఎలాంటి చెడు జరగలేదని, మంచే జరిగిందన్నారు. తన నియోజకవర్గం కోసం చాలా కష్టపడి పని చేస్తున్నానని, సుమారు రూ. 4 వేల కోట్ల పనులు విజయవాడకు మంజూరయ్యాయని చెప్పారు.