కేశినేని అనూహ్య నిర్ణయం: 'ట్రావెల్స్' మూసివేత, గొడవ జరిగిన వారానికి!
నష్టాల కారణంగా కేశినేని ట్రావెల్స్ను మూసివేస్తున్నట్టు ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది.
విజయవాడ: విజయవాడలో ఆర్టీవో అధికారితో వాగ్వాదానికి దిగి టీడీపీ అధిష్టానంతో మాట పడ్డ కేశినేని నాని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నష్టాల కారణంగా కేశినేని ట్రావెల్స్ను మూసివేస్తున్నట్టు ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయం వద్ద కేశినేని ట్రావెల్స్ బోర్డును యాజమాన్యం తొలగించింది.
కాగా, సంస్థను మూసివేయాలన్న ముందస్తు ఆలోచనలో భాగంగానే.. ఇప్పటికే కేశినేని సంస్థ సగానికి పైగా బస్సులను విక్రయించినట్లుగా సమాచారం. ఇటీవల విజయవాడ ఆర్టీవో అధికారితో వాగ్వాదం తర్వాత కేశినేని నాని కొంత అసంతృప్తితో ఉన్నారు. ఆ వాగ్వాదం జరిగిన రోజే సంస్థను మూసివేస్తానని ఆయన ప్రకటించినప్పటికీ.. అధినేత చంద్రబాబు చొరవతో కాస్త వెనక్కి తగ్గారు.
ఇంతలోనే మళ్లీ అనూహ్య నిర్ణయం తీసుకుని ట్రావెల్స్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పునరాలోచించుకోవాలని చంద్రబాబు చెప్పినా.. నష్టాల కారణంగా సంస్థను మూసివేయడమే సరైందని కేశినేని భావించినట్లు తెలుస్తోంది. ఆర్టీవో అధికారితో గొడవ తర్వాత సరిగ్గా వారం రోజులకు నాని ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.ఆ సందర్బంగా నాని ఆర్టీవో అధికారి సుబ్రహ్మణ్యంకు క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే.
ఆర్టీసీకే అప్పగించాలన్న డిమాండ్:
ఆర్టీసీ నష్టాలకు కారణమైన కేశినేని ట్రావెల్స్ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూనే నిబంధనలకు విరుద్దంగా ఆయన బస్సులు నడిపారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పర్మిట్ లేని రూట్లలోనూ బస్సులను తిప్పారని, స్టేజ్ కారియర్లుగా నడిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కేశినేని ట్రావెల్స్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో.. స్వయంగా నానినే వాటిని ఆర్టీసీకి అప్పగించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టి సొంత ఆస్తులను కూడబెట్టుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఇప్పటికైనా పాప ప్రక్షాళన చేసుకోవాలని వారు హితవు పలుకుతున్నారు.