బాలయోగి ఆస్తులు కాజేసి గర్వపడుతున్నా .. మరోమారు బుద్దాను టార్గెట్ చేసిన కేశినేని నానీ
విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య భీకరమైన ట్వీట్ ల వార్ నడుస్తుంది .మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నమీద తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు కేశినేని నానీ . దానికి బుద్దా కౌంటర్ ఇచ్చారు. బాలయోగి ఆస్తులు కాజేశావని బుద్దా వ్యాఖ్యలు చేశారు. ఇక దానికి కేశినేని నానీ ఈ రోజు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఒకపక్క పక్క పార్టీల నేతలు హేళనగా మాట్లాడుతున్నా అవేవీ పట్టించుకోకుండా సొంత పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, చేసుకుంటున్న విమర్శలు టీడీపీ పరువును బజారున పెడుతున్నాయి.
కేశినేని నానీ , బుద్దాల మధ్య ట్వీట్ వార్.. పరువు రోడ్డున పెట్టుకుంటున్న నేతలు
మొన్న కేశినేని నానీ ‘రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు. గుళ్ళో కొబ్బరిచిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి,కాల్ మనీ గాళ్ళకి, సెక్స్ రాకెట్ గాళ్ళకి, బ్రోకర్లకి, పైరవిదారులకి అవసరం. నాకు అవసరం లేదు.' అని నాని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక దానికి బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. ‘నువ్వు చేసినవన్నీ అభాండాలు, నేను చెప్పేవన్నీ నిజాలు. బస్సుల మీద ఫైనాన్స్ తీసుకొని 1997లో సొంతంగా దొంగ రిసిప్ట్ లు తయారుచేసుకుని ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకొని కోట్లాది రూపాయలకు ఫైనాన్స్ కంపెనీలను చీట్ చేసిన నువ్వా ట్వీట్ చేసేది.' అని ట్వీట్ చేశారు. దీంతోపాటు దళితనాయకుడు బాలయోగి ఆస్తులు కాజేసిన దొంగ , నేను చెప్పే నిజాలు చాలానే ఉన్నాయి. వినే ధైర్యం నీకుందా అంటూ ట్వీట్ చేశారు.
Recommended Video
బాలయోగి ఆస్తులను కాజేసి గర్వపడుతున్నా అని బుద్దాకు కౌంటర్ ఇచ్చిన నానీ
ఇక దానికి కేశినేని నానీ ఈ రోజు ఘాటుగా సమాధానం ఇచ్చారు. తాను బాలయోగి ఆస్తులు కాజేసిన మాట వాస్తవమేనని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసిన ఆయన, ఓ ప్రబుద్ధుడు చెప్పిన మాటలు వాస్తవమేనని అన్నారు. "నేను బాలయోగి ఆస్తులు కాజేశానని ఒక్క ప్రబుద్ధుడు చెప్పింది యదార్థం. బాలయోగికి ఉన్న ఆస్తులు నీతి, నిజాయితీ, విలువలు, సిద్ధాంతాలు, ప్రజల పట్ల అంకితభావం, ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి. వీటిని కాజేసి, పాటిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను" అని పేర్కొన్నారు. మొన్న చేసిన ట్వీట్ లతో చంద్రబాబు వీరిరువురితో సమావేశం అవ్వాలని , ఇద్దరినీ సంయమనంతో ఉండాలని కోరారని సమాచారం .
టీడీపీ అధినేత అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టకుంటే టీడీపీకి నష్టమే
ఇక చంద్రబాబు కోరినప్పటికీ విజయవాడ తెలుగు తమ్ముళ్ల మధ్య ట్వీట్ల యుద్ధానికి తెర పడటం లేదు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల వార్ నడుస్తూనే ఉంది. చంద్రబాబు సూచన మేరకు వెంకన్న ఈ వివాదానికి పుల్స్టాప్ పెట్టారు. కానీ ఎంపీ కేశినేని నానీ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. వెంకన్నను మళ్లీ టార్గెట్ చేశారు.. ఆయన రెండు రోజుల క్రితం చేసిన ట్వీట్ను ప్రస్తావిస్తూ ఈ రోజు మళ్లీ రెచ్చిపోయారు. ఇక ఈ అంతర్గత కుమ్ములాటలకు చంద్రబాబు చెక్ పెట్టకుంటే అది టీడీపీకి మరింత చేటు చేస్తుంది.