జగన్తో కలిసి వచ్చేసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ఆరాటం: కేశినేని నాని
విజయవాడ: ఇప్పటి వరకు విభజన హామీలు నెరవేర్చని బీజేపీ నేతలు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తారని చెబితే నమ్మాలా అని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని సోమవారం ప్రశ్నించారు.
బ్యాంకులను ముంచిన దొంగలను దేశం దాటించిన ఘనత బీజేపీది అన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణం గత ప్రభుత్వం హయాంలో జరిగిన విషయం బీజేపీ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు.
జగన్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ఉబలాటం
ఎస్సెల్ గ్రూప్ను బెదిరించి వెనక్కి పంపించింది బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, జీవీఎల్ నర్సింహా రావు, రామ్ మాధవ్ అని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ఉబలాటపడుతోందని చెప్పారు. అంతకుముందు బీజేపీ నేత రామ్ మాధవ్ మాట్లాడుతూ.. ఏపీలో వచ్చే ప్రభుత్వంలో తాము కీలకం కానున్నామని చెప్పారు. దీనిపై కేశినేని పైవిధంగా స్పందించారు.
వచ్చేసారి మేం కీలకం, ఎవరు ఆంబోతులో తెలుసు: రామ్ మాధవ్
ఆ రాష్ట్రాల వారికి న్యాయం వద్దా?
టిట్లీ ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం బృందాన్ని ఇంత వరకు పంపించలేదని కేశినేని నాని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఏపీలో ధర్మ పోరాట దీక్ష చేస్తున్న బీజేపీ కర్ణాటకలో ఎందుకు చేయడం లేదని ప్రభుత్వ విప్ కూన రవి కుమార్ ప్రశ్నించారు. తెలంగాణలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం అక్కరలేదా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కేంద్రం ఎందుకు కొనుగోలు చేయదని ప్రశ్నించారు.
చంద్రబాబు అంటే బీజేపీకి భయం
విభజన హామీలను నెరవేర్చని బీజేపీ నేతలను ఏపీ ప్రజలు తరిమి తరిమి కొడతారని కేశినేని నాని అన్నారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను బీజేపీ నేతలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అంటే బీజేపీకి భయమని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ స్కాం టీడీపీ హయాంలో జరగలేదని, అయినా బాధితులను ఆదుకుంటామని చెప్పారు.
అవినీతిలో గుజరాత్ టాప్, చివరలో ఏపీ
ఎస్సెల్ గ్రూప్ను ఢిల్లీకి పిలిపించుకొని అగ్రిగోల్డ్ను కొనవద్దని బీజేపీ నేత అమిత్ షా చెప్పారని, ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు అమలయ్యేలా కృషి చేయాలని కేశినేని అన్నారు. నీతి, నిజాయితీ గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని, అవినీతిలో టాప్లో గుజరాత్ ఉంటే చివరలో ఏపీ ఉందని చెప్పారు.