దుర్గా పీఠంను రూ. కోటికి మోసగించిన కేశినేని రమేష్ అరెస్ట్,రివాల్వర్ స్వాధీనం
విజయవాడ: దుర్గా పీఠం భూ కుంభకోణంలో నిందితుడు కేశినేని రమేష్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక రివాల్వర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కేశినేని రమేష్ ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్నట్లు తెలిసింది. భవానీ దుర్గా గురుపీఠం ఆశ్రమం కోసం భూమి అమ్మకం పేరుతో రమేష్ కోటి రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. రమేష్పై ఇప్పటికే పలు ప్రాంతాల్లో చీటింగ్ కేసులున్నట్లు సమాచారం. ఈ ఛీటింగ్ కేసుకు సంబంధించి కేశినేని రమేష్తో పాటు అతనికి సహకరించిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
భవానీ భక్తుల ఆశ్రమం కోసం నూజీవీడులో 100 ఎకరాల భూమి ఉందంటూ అఖిల భారత భవానీ పీఠంను సంప్రదించాడు కేశినేని రమేష్ అలియాస్ నవీన్. ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు అంటూ కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు చూపించి విడతల వారీగా కోటి రూపాయలు అఖిల భారత భవానీ పీఠం నుంచి డబ్బులు వసూలు చేశాడు. అయితే ఆ వంద ఎకరాల భూమితో రమేష్ కు ఎలాంటి సంబంధం లేదని దుర్గా ట్రస్ట్ నిర్వాహకులకు తెలిసింది.
ఈ మోసాన్ని గ్రహించిన ట్రస్ట్ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు విరాళాలు ఇచ్చిన సొమ్ము ఈ విధంగా స్వాహా అయినట్లు పోలీసులకు తెలిపారు. ట్రస్ట్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు నిందితుడు కేశినేని రమేష్ను శుక్రవారమే అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం అతడి అరెస్ట్ ను అధికారికంగా ధృవీకరించారు.