జమ్మూ కాశ్మీర్ అంశంలోనూ కేశినేని వర్సెస్ పీవీపీ .. వీళ్ళ లొల్లి ఆగేలా లేదుగా !
విజయవాడ ఎంపీ కేశినేని నాని, పీవీపీల మధ్య ట్విట్టర్ వార్ కు ఫుల్ స్టాప్ పడేలా లేదు. నానీ ఏ ట్వీట్ చేసినా పీవీపీ స్పందిస్తున్నారు. అలాగే పీవీపీ ఏ ట్వీట్ చేసినా నానీ రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ మధ్య రాజకీయాల విషయంలోనే కాదు ఏ అంశంపైన ఎవరు మాట్లాడినా సరే మరొకరు ఘాటుగా స్పందించటం కనిపిస్తుంది. ఇక తాజాగా జమ్మూ కాశ్మీర్ పునర్విభజన విషయంలో కూడా ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
అప్పుడు ఆంధ్రా ప్రజల గొంతు.. ఇప్పుడు కాశ్మీర్ ప్రజల గొంతు నొక్కారన్న కేశినేని నానీ
జమ్మూ కశ్మీర్ ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ, పార్లమెంట్ ఆమోదించిన బిల్లుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు టీడీపీ సైతం మద్దతు తెలిపినా కేశినేని నానీ మాత్రం కాశ్మీర్ ప్రజల అభిప్రాయం కనుక్కొని వారి సమ్మతంతో జమ్ముకాశ్మీర్ పునర్విభజన చేస్తే బాగుండేది అనే అభిప్రాయం ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. నానీ తన ట్వీట్ లో "కాశ్మీర్ విషయంలో జరిగిన తీరు ఆమోదయోగ్యం కాదు. ఆ రోజు ఆంధ్ర ప్రజల గొంతు నొక్కారు. ఈ రోజు కాశ్మీర్ ప్రజల గొంతు నొక్కారు. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ,గులాంనబీ ఆజాద్ ,ఒమర్ అబ్దుల్లా వంటి కాశ్మీరీ నాయకులకైనా వారి వాదన వినిపించే అవకాశం ఇచ్చి, తరువాత చేయవలసింది చేస్తే ఆక్షేపణ వుండేది కాదు" అని అన్నారు. ఇక అంతకు ముందు కూడా నానీ మరో ట్వీట్ చేశారు. కాశ్మీర్ తో నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది.కాశ్మీరీలు చూపించే ప్రేమ, అభిమానం, వినయ ,విధేయతలు నిజంగా మనకు ఆశ్చర్యం కలుగతుంది. కాశ్మీర్ భూతల స్వర్గం. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కాశ్మీర్ కు, దేశానికి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలని పేర్కొన్నారు కేశినేని నానీ .
నీకు ఆమోద యోగ్యం కాకుంటే అన్నీ మూసుకు కూర్చో అని పీవీపీ ఘాటు వ్యాఖ్యలు
ఇక కేశినేని నానీ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ వరప్రసాద్ ఖండించారు. నానీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన పీవీపీ "చిట్టచివరకు జాతి అభిప్రాయం పార్లమెంట్ లో ప్రతిబింబించింది. నీకు ఆమోదయోగ్యం కాకపోతే అన్ని మూసుకో అని ఘాటుగా విమర్శలు చేశారు . ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకో అంటూ పేర్కొన్న పీవీపీ ఆ రాష్ట్రానికి మీరంటున్న నిరాశా నాయకులు ఏం చేశారు...72 ఏళ్ల రక్తపాతం మించి ఏం జరిగింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దయచేసి రాహుల్ పండితా రచించిన 'అవర్ మూన్ హ్యాజ్ బ్లడ్ క్లాట్స్' అనే పుస్తకం చదువు. నీ కళ్లు తెరచుకుంటాయి" అని పీవీపీ కేశినేని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
కేశినేని నానీ .. పీవీపీల లొల్లి పై ప్రజల్లో చిరాకు
ఇలా కేశినేని నానీ, పీవీపీ మధ్య ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉంది.. దీనికి ఎండ్ కార్డ్ పడదేమో అన్న భావన వీళ్ళ లొల్లి చూసిన వాళ్లకు కలుగుతుంది. కేశినేని జమ్ముకాశ్మీర్ అంశామపై స్పందిస్తే అందులో పీవీపీ ప్రస్తావన లేకున్నా పీవీపీ కేశినేని నానీని టార్గెట్ చెయ్యటం , ఇక నానీ కూడా ఏ మాత్రం తగ్గకుండా పీవీపీ పై విమర్శనాస్త్రాలు గుప్పించటం చూస్తే ఇందుకా వీళ్ళను రాజకీయనాయకులుగా ప్రజలు భావించి ఎన్నికల్లో ఓట్లేసింది అన్న ఫీలింగ్ కలుగుతుంది.