ప్రాణహని ఉంది: బాబును కోరిన కేతిరెడ్డి, లక్ష్మీపార్వతి గ్రామంలో ఇలా..
అమరావతి: 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిశారు. వైసీపీ నేత లక్ష్మీపార్వతి నుంచి తనకు, సినిమా యూనిట్కు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరారు.ఈ మేరకు చంద్రబాబునాయుడు నుండి సానుకూల సంకేతాలు వచ్చాయని ఆయన చెప్పారు.
ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమాలపై మూడు సినిమాలు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ తనయుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తేజ డైరెక్షన్లో సినిమా తీస్తున్నారు. అయితే సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ కూడ మరో సినిమా తీస్తున్నారు..
ఈ రెండు సినిమాలతో పాటుగా కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి కూడ లక్ష్మీస్ వీరగ్రంధం పేరుతో మరో సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రారంభించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు.
బాబును కలిసిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడును లక్ష్మీస్ వీరగ్రంధం సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి కలిశారు. తనతో పాటు,తన సినిమా యూనిట్కు ప్రాణహనీ ఉందని ఆయన చెప్పారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. సచివాలయంలో చంద్రబాబునాయుడును కలిసి ఈ మేరకు ఆయన విన్నవించారు. ఇటీవల హైద్రాబాద్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే సమయంలో లక్ష్మీపార్వతి సినిమా షూటింగ్ను అడ్డుకొన్నారు. అంతేకాదు ఈ సినిమాపై లక్ష్మీపార్వతి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చంద్రబాబునాయుడును కలిశారు.
. అసలు వివాదమేమిటీ
రామ్గోపాల్ వర్మ, తేజ డైరెక్షన్లలో రెండు వేర్వేరు సినిమాల నిర్మాణాలకు సన్నాహలు సాగుతున్న తరుణంలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మరో సినిమాను ప్రారంభించనున్నట్టు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించడానికి ముందు లక్ష్మీపార్వతి జీవిత చరిత్రపై ఈ సినిమా ఉంటుందని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు.ఎన్టీఆర్ ను లక్ష్మీపార్వతి వివాహం చేసుకోవడానికి చోటు చేసుకొన్న పరిస్థితులపై ఈ సినిమాలో చూపించనున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే లక్ష్మీపార్వతి మాత్రం ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తనను కించపర్చేందుకు ఈ సినిమాను తీస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.
లక్ష్మీపార్వతి గ్రామంలో..
లక్ష్మీపార్వితి ఎన్టీఆర్ను వివాహం చేసుకోవడానికి ముందు ఆమె జీవితంలో చోటు చేసుకొన్న ఘటనల గురించి తెలుసుకొనేందుకు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆమె స్వగ్రామంలో ఇటీవల పర్యటించారు. ఆమె గురించి వివరాలు తెలుసుకొన్నారు. ఈ అంశాలన్నింటిని ఈ సినిమాలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చూపించే అవకాశాలు లేకపోలేదు.
కేతిరెడ్డి సినిమా
కేతిరెడ్డి తీయనున్న సినిమాపై లక్ష్మీపార్వతి నుండి అనుమతి తీసుకోలేదని ఆమె చెబుతున్నారు. అంతేకాదు తనపై బురద చల్లేందుకే ఈ సినిమా తీస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నిరసన కూడ ఇటీవల చేపట్టారు. ఈ సినిమా తనను విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపణలు గుప్పించారు. అయితే కేతిరెడ్డి మాత్రం లక్ష్మీపార్వతి ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఈ తరుణంలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చంద్రబాబునాయుడును కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది.