ప్రభుత్వ పాలనకు సంబంధించిన కీలక బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం
అమరావతి: పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన కీలకమైన బిల్లులను ఆంధ్రప్రదేశ్ శాసనసభ బుధవారం ఆమోదించింది. మున్సిపాలిటీ లే అవుట్లకు ఆన్లైన్లో అనుమతులు, నాలా చట్ట సవరణ బిల్లు, సీఆర్డీఏ భూములను ప్రభుత్వ ఆధీనంలో ఉంచేందుకు సంబంధించిన బిల్లు, వీధి కుక్కలు, పందుల నియంత్రణను పంచాయతీలకు అప్పగించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు వంటి కీలకమైన అంశాలకు సంబంధించిన బిల్లులను ఎపి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అలాగే వ్యవసాయ భూమిని పారిశ్రామిక అవసరాలకు కేటాయించడం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే అవకాశం కల్పించడం, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించేందుకు అనువుగా భూ మార్పిడి చెయ్యడానికి ఉద్దేశించిన సవరణ బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. రెవెన్యూ అధికారుల ఆమోదం పొందాల్సిన అవసరం లేకుండానే చలానా చెల్లిస్తే భూ మార్పిడి చేసేలా నిబంధనల్లో సవరణలు చేశారు.
నాలా చట్ట సవరణ అనంతరం విజయవాడలో మార్పిడి ధరలు 5 నుంచి 2 శాతానికి, ఇతర ప్రాంతాల్లో 9 నుంచి 3శాతానికి తగ్గిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ సందర్భంగా అసెంబ్లీలో వివరించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో రెసిడెన్స్, నాన్ రెసిడెన్స్ ప్రాంగణాల్లో అద్దె బిల్లుకు కూడా శాసన సభ ఆమోద ముద్ర వేసింది.
పరస్పర అంగీకారంతో రెంట్ వసూలు, ప్రతి ఆరు నెలలకు ఒకసారి అగ్రిమెంట్ చేయించి రిజిస్ట్రేషన్ లేదా నోటరీ ద్వారా అంగీకారం చేసుకునేలా పురపాలకశాఖ మంత్రి నారాయణ ఈ అద్దె బిల్లును ప్రతిపాదించారు. మరో వైపు అద్దె చెల్లించకపోతే రెండు నెలల్లో ఖాళీ చేయించేందుకు కూడా భవన యజమానులకు అధికారాన్ని కట్టబెట్టేలా బిల్లును సవరించారు. పట్టణ ప్రాంతాల్లో ఆన్ లైన్లో లే అవుట్ లకు అనుమతులను మంజూరు చేయటంతో పాటు అనుమతుల మంజూరు అధికారాన్ని మున్సిపల్ కమిషనర్లకు అప్పగిస్తూ సవరించిన ఏపీ పురపాలక సవరణ చట్టానికి కూడా సభ ఆమోదాన్ని తెలియజేసింది.
సిఆర్ డిఎ సంస్థలో కలెక్టర్ అర్హత కలిగిన ఐఏఎస్ అధికారులను నియమించేందుకు వీలుగా సవరణ చేసిన బిల్లు, దీనితో పాటు క్యాపిటల్ రీజియన్ లో సీఆర్డీఏకు దాఖలు పడిన 23 శాతం భూములపై అజమాయిషీని ప్రభుత్వానికి అప్పగిస్తూ ప్రతిపాదించిన సవరణ బిల్లుకు సైతం శాసనసభ ఆమోదం లభించింది.