ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై జగన్ కీలక నిర్ణయం- డిప్యుటేషన్కు ఇది తప్పనిసరి
ఏపీలో పనిచేస్తున్న అఖిల బారత సర్వీసు అధికారుల సర్వీసు రూల్స్ విషయంలో ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పనిచేసే అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనల్ని మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబందనల నుంచి కేవలం గవర్నర్ కార్యదర్శికి మాత్రం మినహాయింపు కల్పించారు.
ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా కేంద్ర సర్వీసులకు వెళ్లడం సర్వసాధారణంగా మారింది. తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు, లేదా మధ్యలో కూడా కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకుని వెళ్లిపోతున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా పోతోంది. దీంతో ఇకపై ఏపీలో పనిచేస్తూ కేంద్ర సర్వీసుల్లోకి వెల్లాలనుకునే ఐఏెఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం కొత్తగా రూల్స్ మార్చింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఇవాళ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు నివేదికను సీఎం జగన్ ఆమోదం తప్పనిసరి అని పేర్కొన్నారు. సీఎం ఇచ్చే నివేదిక ఆధారంగానే వారు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా వారు ఇష్టం లేకపోయినా ఏపీలోనే పని చేయాల్సి ఉంటుంది. అంతే కాదు ఐఏఎస్ అధికారుల ప్రమోషన్ల విషయంలోనూ సీఎం ఇచ్చే నివేదికే కీలకం కానుంది. గవర్నర్ కార్యదర్శికి మాత్రమే దీన్నుంచి మినహాయింపు ఇచ్చారు.