ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు, అధికారులపై చంద్రబాబు సీరియస్
అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం 60కి పైగా అంశాలపై చర్చలు జరిపింది.
అమరావతి: అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుదీర్ఘ సమయంపాటు సాగిన ఈ సమావేశంలో మంత్రివర్గం 60కి పైగా అంశాలపై చర్చలు జరిపింది.
ఈ సందర్భంగా ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని రైతులకు మూడవ దశ రుణమాఫీ నిధుల విడుదల, నిరుద్యోగ భృతి, జలసిరి కార్యక్రమంపై మంత్రులు చర్చించారు. రాష్ట్రంలో వివిధ సంస్థలకు భూకేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలోని చక్కెర, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలను ఆదుకునేందుకు పలు నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రూల్స్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, పెసలు కొనుగోళ్లపై కూడా చర్చించింది.
నీటి పారుదల శాఖకు రుణం ఇచ్చే అంశంపై ఓ నిర్ణయం తీసుకుంది. బోగస్ వ్యవసాయ కళాశాలలపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
చంద్రబాబు సీరియస్...
ఇసుక పంపిణీపై కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ''పొరుగు రాష్ట్రాల కంటే తక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నాం, రీచ్ల నుంచి ఉచితంగా ఇసుక ఇస్తున్నాం, వ్యతిరేక ప్రచారం ఎందుకు జరుగుతోందని సీఎం ఆగ్రహం'' వ్యక్తం చేశారు.
తనిఖీలు జరపాలని సీఎస్, ఉన్నతాధికారులకు సీఎం ఆదేశలిచ్చారు. కొత్త పోస్టుల మంజూరు కోరిన వైద్య ఆరోగ్యశాఖపై చంద్రబాబు మండిపడ్డారు. ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా వైద్యశాఖ తీరుమారడం లేదన్న సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.