AP Cabinet Meet:స్థానిక సంస్థల ఎన్నికల పై ప్రతిపాదనలు...ఆమోదించే ఛాన్స్
అమరావతి: సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశమైంది. సీఎం జగన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పంచాయతీ రాజ్ చట్టంలో కీలక సవరణలు చేసే అంశంపై కేబినెట్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నందున కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
స్థానిక ఎన్నికల ప్రచారంలో మద్యం నగదు పంచుతూ పట్టుబడి నేరం రుజువైతే అభ్యర్థిపై అనర్హత వేటు వేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంను కూడా కుదించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలన్నిటికీ ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇక ఒకటి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద స్కూలు బ్యాగ్ ఇవ్వాలని ప్రతిపాదన ప్రభుత్వం సిద్ధం చేసింది. దీంతో పాటు మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, నోటు పుస్తకాలు ఇచ్చే అంశం కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు రానుంది.
ఎర్ర చందనం కేసులపై కూడా ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఎర్ర చందనం కేసుల విచారణ కోసం తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. గతంలో చాలా కేసులు పెండింగ్లో ఉ్ననాయని వీటిని వెంటనే క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన ర్యాలీలపై నమోదైన కేసులను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఆ కేసులను రద్దు చేసే విషయం కూడా కేబినెట్లో ప్రస్తావించే అవకాశం ఉంది.
ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక 27 రోజులుగా ఉన్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను 20 రోజులకే కుదించే ప్రతిపాదనపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ముసాయిదా బిల్లు ఆమోదంపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా మంత్రివర్గం ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి.