జనసేన కీలక నేతల వలసల బాట .. ఆ ఎన్నికలకు జనసేనానికి తెచ్చింది తంటా
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుంది, ప్రభావం చూపిస్తుంది అని అందరూ భావిస్తే ప్రశ్నిస్తా అని వచ్చిన పార్టీ ప్రశ్నించటానికే పరిమితం అయ్యింది. జనసేన ఏపీలో ఒక్క స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ పార్టీలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇక పవన్ పార్టీలో ప్రభావం చూపించగల నేతలు కూడా ఓటమి పాలయ్యారు. దీంతో జనసైనికులు నిరాశా నిస్పృహల్లో ఉన్న సమయంలో రాజకీయాలను వీడేది లేదు . నా ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీని ముందుకు నడిపిస్తానని , పార్టీని బలోపేతం చేసి ముందుకు వెళ్తానని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నా పార్టీ పట్ల కీలక నేతల విముఖత వలసల బాట పట్టిస్తుంది. ఇది జనసేనానికి పెద్ద తలనొప్పిగా తయారైంది.
జనసేనలో ఆయనకు కీలక పదవి..అయినా గుడ్ బై చెప్పేసారు: అధినేత పైన అసంతృప్తితోనే ..!
పవన్ తీరుతో పార్టీ కీలక నేతల్లో అసంతృప్తి
గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి, 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత, జనసేన పార్టీ ఇక ఉండదు అని అందరూ భావించారు . జనసేన పార్టీ పని అయిపొయింది అని అందరూ వ్యంగ్యంగా మాట్లాడుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పార్టీని ముందుకు నడిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ఆయన యుద్ధం ప్రకటించారు.
పార్టీ బలోపేతంపై కాకుండా ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ ఫోకస్
పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతంగా లేకపోవటం , నాయకత్వ లేమి వెరసి పార్టీ ఎన్నికల్లో దెబ్బ తింది. ఇక ప్రస్తుతం సైతం పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చెయ్యటంపై దృష్టి సారించకుండా ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలపై ఫోకస్ చెయ్యటం పార్టీలోని నాయకులకు నచ్చటం లేదు. అందుకే కీలక నాయకులు పార్టీకి గుడ్ బై చెప్తున్నారని టాక్ వినిపిస్తుంది. గతంలో పవన చేసిన తప్పులనే మళ్ళీ పదేపదే చేస్తున్నారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనసేనకు గుడ్ బై చెప్తున్న కీలక నేతలు
పవన్ కళ్యాణ్ తీరుతో జనసేన నుండి పక్క పార్టీల వైపు చూస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నిన్నటికి నిన్న జనసేన కీలక నేత , పవన్ కు సన్నిహితంగా మెలిగిన నేత జనసేనకు గుడ్ బై చెప్పారు. పార్టీలో సీనియర్ నేతగా కొనసాగి అనకాపల్లి ఎంపీ స్ధానం నుండి పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చింతల పార్ధసారథి గుడ్బై చెప్పడం ఆ పార్టీ భవిష్యత్తును తెలియజేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జనసేనలో కీలక నాయకుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్ సైతం ఇప్పుడు జనసేన పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు. జనసేనలో ఉంటె రాజకీయ భవిష్యత్ ఏంటి అన్న ఆలోచనలో ఉన్నారని , తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు దారిలో ఆయన కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం సైతం లేకపోలేదు .
దగ్గర పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు .. జనసేనలో ఆందోళన
ఒకపక్క ఏపీలో టీడీపీ ని ఖాళీ చేస్తామని బీజేపీ దూకుడు చూపిస్తున్న వేళ వైసీపీ నుండి జనసేన నుండి కూడా నాయకులను ఆకర్షించే పనిలో పడింది బీజేపీ . ఈ నేపధ్యంలో పార్టీని బలోపేతం చెయ్యటం అటుంచి పార్టీలో ఉన్న కీలక నేతలు పార్టీ వీడకుండా కాపాడే ప్రయత్నం పవన్ చేస్తారా ? ఒకపక్క స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుంటే జనసేన కీలక నేతలు జంప్ అంటుంటే అది పార్టీ కి పెద్ద మైనస్ గా మారే ప్రమాదం కనిపిస్తుంది.జనసేన నేతల్లో ఆందోళన కనిపిస్తుంది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసి తమ సత్తా చాటాలని జనసేన భావిస్తుంది. కానీ తాజా పరిస్థితులు అందుకు భిన్నంగాకనిపిస్తున్నాయి.
వలసలకు కారణం పవన్ గ్రహిస్తారా ?
పార్టీని బలోపేతం చెయ్యాల్సిన అవసరం ఉన్న చోట అది పక్కన పెట్టి పవన్ చేసే రాజకీయం రుచించని నేతలు పార్టీని వీడి వెళ్తున్నారు. పవన్ అసలు విషయాన్ని పక్కన పెట్టి కొసరు విషయాలను పట్టించుకోవటం ఇందుకు కారణం అని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న రాజీనామాలు , వలసలు పవన్ కు , జనసేన పార్టీకి పెద్ద ఇబ్బంది అని చెప్పొచ్చు .మరి ఇప్పటికైనా పవన్ వసలకు కారణం గ్రహిస్తారా ? లేకా ఇలాగే కొనసాగిస్తారా ? అన్నది ముందు ముందు తెలియాల్సి వుంది.