రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తెగని అప్పుల పంచాయతీ:ఎవరిది ఎంతో ఇంకా తేలలేదు?
అమరావతి:రెండు తెలుగు రాష్ట్రాలు విభజన చెందక ముందు ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న అప్పుల పంపకం పంచాయతీ నేటికీ తెగకపోవడం ఆంధ్రప్రదేశ్ కు సమస్యాత్మకంగా పరిణమించింది.
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక అప్పుల్లో ఆ రెండు రాష్ట్రాలది ఎవరివాటా ఎంతో తేలకపోవడంతో ఆ అప్పులపై వడ్డీ భారాన్ని ప్రస్తుతం ఎపి ఖజానా నుంచే భరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పు విషయమై ఈ ఇరు రాష్ట్రాలు ఎవరి వాటా ఎంతో తేల్చుకోనంత కాలం నష్టం ఆంధ్రప్రదేశ్ కే. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ లో ఈ విషయమై కీలక సమావేశం జరగనుంది.
మొత్తం అప్పు...ఎంతంటే?
రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్-తెలంగాణా మధ్య ఇంకా రూ 9 వేల కోట్ల రూపాయల అప్పుకి సంబంధించి ఎవరు ఎంత చెల్లించాలనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ 9 వేల కోట్ల రూపాయల అప్పుపై వడ్డీ భారాన్ని ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ అప్పుకు సంబంధించి ఎవరివాటా ఎంతో తెలిస్తే వడ్డీ మొత్తం ఎపినే భరించే భారం తగ్గుతుందంటున్నారు.
పాత అప్పులు...లెక్కలు ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2 వ తేదీ నాటికి ఉమ్మడి రాష్ట్రానికి రూ.1,66,522 కోట్లు అప్పుగా ఉన్నట్లు లెక్క తేల్చారు. వీటిలో కేంద్రం సహకారం, అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలే ఎక్కువగా ఉన్నాయి. ఒక విడతగా రూ.1,48,855 కోట్ల రుణంలో రూ.1,48,060 కోట్ల వరకు 2015లోనే అప్పుల వాటాల పంపకం జరగగా, మరో రూ.795 కోట్లకు గత నెలలో పరిష్కారం జరిగింది. ఈ రెండు రాష్ట్రాలకు అప్పుల పంపకాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అంతవరకూ అప్పుల విభజన ప్రక్రియ పూర్తయింది.
కేంద్రం సంబంధిత...అప్పులు
కేంద్రం నుంచి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కు నేరుగా వచ్చిన అడ్వాన్సులు, రుణాలు రూ.17,666 కోట్లుగా ఉన్నాయి. వీటిలో రూ.8723 కోట్ల రుణాన్ని జూన్లో రెండు రాష్ట్రాలకు పంచారు. అయినా ఇంకా రూ.8929 కోట్లకు పంపకాలు జరగలేదు. వీటిపై వడ్డీని ఎపినే చెల్లించాల్సి వస్తోంది. ఈ రుణాల్లో కొన్ని ప్రాజెక్టులు తెలంగాణ భూభాగానికే పరిమితం కాగా, మరికొన్ని ఆంధ్రాలోనే ఉన్నాయి. మరికొన్ని రుణాలను రెండు ప్రాంతాల్లోని పనులకు ఖర్చు చేయడం జరిగింది. కానీ వీటి విషయమై ఉభయ రాష్ట్రాల మధ్యా ఏకాభిప్రాయం లేకపోవడంతో నాలుగేళ్లుగా ఈ మిగిలిన పంపకాలు వరకు పెండింగ్లోనే ఉన్నాయి.
సోమవారం...కీలక సమావేశం
ఈ నేపథ్యంలో ఈ అప్పులకు సంబంధించి సోమవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఈ అప్పుల వాటాల పంపిణీపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనైనా అప్పుల వాటాలు తేలిపోతే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ అధికారులు ఆశిస్తున్నారు. లేనిపక్షంలో మొత్తం వడ్డీ చెల్లిస్తూవస్తున్న ఎపినే మరికొంతకాలం నష్ట భారాన్ని మోయాల్సిన పరిస్థితి కొనసాగుతుంది.
మొత్తం అప్పు...ఎంతంటే?
రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్-తెలంగాణా మధ్య ఇంకా రూ 9 వేల కోట్ల రూపాయల అప్పుకి సంబంధించి ఎవరు ఎంత చెల్లించాలనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ 9 వేల కోట్ల రూపాయల అప్పుపై వడ్డీ భారాన్ని ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ అప్పుకు సంబంధించి ఎవరివాటా ఎంతో తెలిస్తే వడ్డీ మొత్తం ఎపినే భరించే భారం తగ్గుతుందంటున్నారు.