టీటీడీ భూముల అమ్మక తీర్మానం నిలిపివేస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు.. వివాదానికి చెక్ !!
టీటీడీ భూముల విక్రయాల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే జగన్ సర్కార్ మొదట నుండి దేవాలయాల విషయంలో తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతూనే ఉన్నాయి. ఇక తాజాగా సున్నితమైన తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూడా టీటీడీ తీసుకున్న నిర్ణయం జగన్ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక ఈ వివాదానికి చెక్ పెట్టేలా ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది .
Recommended Video
మన పాలన .. మీ సూచన .. ఏడాది పాలనపై జగన్ సదస్సుల లక్ష్యం ఇదే ..
వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
టీటీడీ భూములను అమ్మాలని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ విషయంలో టీటీడీ ఆచితూచి వ్యవహరించాల్సి ఉన్నా అలా చేయకపోవడంతో ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల, అటు హిందుత్వ వాదుల ఉద్యమం మొదలైంది. ఇక ఈ నేపధ్యంలో ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశం కావటంతో తిరుమల తిరుపతి దేవస్థానానికికి చెందిన ఆస్తుల అమ్మక నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది.
తీర్మానం నెం. 252 నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
టీటీడీ భూముల విక్రయాలకు సంబంధించి అమ్మకంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టీటీడీ భూముల విక్రయ నిర్ణయం ఇప్పటిదికాదని 2016 జనవరి 30న టీటీడీ ట్రస్ట్ బోర్టు తమకు చెందిన 50 ఆస్తులను విక్రయించాలని నిర్ణయించిందని ఇక దానిని అమలు చేయాలని ప్రస్తుత టీటీడీ బోర్డు భావించింది. ఇక ఇది ఇప్పుడు వివాదంగా మారటంతో దీనికి సంబంధించి తీర్మానం నెం. 252 నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తీర్మానం నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం
ఇప్పటికే టీటీడీ భూముల విక్రయాలపై అగ్రహ జ్వాలలు మిన్ను ముడుతున్న వేళ స్వామీ స్వరూపా నందేంద్ర స్వామీజీ సీఎం జగన్ తో, లాగే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తో మాట్లాడారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వివాదరహితంగా నిర్ణయం తీసుకోవాలని స్వామీజీ సూచన చేశారు . ఇక దీంతో టీటీడీ బోర్డు వెనక్కు తగ్గింది. ఇక ఈ వ్యవహారంపై మత పెద్దలు, ధార్మిక సంస్థలు, భక్తులు ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తరువాతనే భూముల విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
ఆ స్థలాల్లో ఆలయాల నిర్మాణం, ధర్మ ప్రచార కార్యక్రమాల అవకాశాలను పరిశీలించమని ఆదేశం
అంతేకాదు ఆ స్థలాల్లో దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ అంశాలన్నీ పరిశీలించే వరకు భూముల విక్రయాల ప్రక్రియను నిలుపుదల చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది .ఇప్పటికే పలు సందర్భాలలో ఏపీలోని అధికార వైసీపీ ఆది నుండి ఆలయాల విషయంలో పలు విమర్శలను ఎదుర్కొంటుంది. ఇక తాజా టీటీడీ నిర్ణయంతో మరోమారు వివాదం నెలకొనగా అమ్మకాల తీర్మానం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగేలా చేసింది.
తాజా ఉత్తర్వులతో వివాదానికి చెక్
జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఆయన హిందూ మతంపై కక్షకట్టారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది . టీటీడీ భూముల అమ్మకంపై విస్తృత సంప్రదింపులు జరిపిన తరువాతే ముందుకు వెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ చైర్మన్ గా క్రైస్తవుడిని నియమించారని, కొండపైన చర్చి కట్టారని రకరకాల ఆరోపణలు జగన్ సర్కార్ ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఇక తాజా నిర్ణయంతో జారీ చేసిన ఉత్తర్వులతో తాజా విమర్శల నుండి కాస్త జగన్ ప్రభుత్వానికి ఊరట లభించింది.