నిమ్మగడ్డపై సుప్రీంకోర్టుకు: లా పాయింట్లు లాగిన జగన్ సర్కార్: పిటీషన్లో కీలకాంశాలు ఇవే
అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటీషన్ను దాఖలు చేసింది. ఇందులో పలు కీలక అంశాలను తన పిటీషన్లో ప్రస్తావించింది ఏపీ ప్రభుత్వం. గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్, ఈ విషయంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా జస్టిస్ కనగరాజ్ నియామకం.. వంటి అంశాలను ఇందులో చేర్చింది.
ఏపీ కొత్త ఎస్ఈసీగా మన్మోహన్ సింగ్..? మరో ఆర్డినెన్స్ జారీకి సర్కార్ కసరత్తు
ఎన్నికల కమిషనర్ నియామక అధికారంపై
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమించే అధికారం ఒక్క గవర్నర్కే ఉంటుందని హైకోర్టులో తన తీర్పులో వెల్లడించిన అంశాన్ని ఏపీ ప్రభుత్వం తన పిటీషన్లో ప్రస్తావించింది. ఇది సరైనది కాదని అభిప్రాయపడింది. ఎన్నికల కమిషనర్ నియామక అధికారం గవర్నర్కు తప్ప, మంత్రిమండలికి లేదని చెప్పడం సరైనదిగా తాము భావించట్లేదని పేర్కొంది. ఇదివరకు జరిగిన నియామకాలన్నీ మంత్రివర్గంలో చర్చించి, తీసుకున్న నిర్ణయాలేనని పేర్కొంది. రమేష్ కుమార్ నియామకం కూడా అలా జరిగిందేనని గుర్తు చేసింది.
రమేష్ కుమార్ నియమించింది గత ప్రభుత్వ మంత్రివర్గమే..
రమేష్కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తొలిసారిగా నియమించింది గత ప్రభుత్వమేనని, అప్పటి మంత్రివర్గమే ఆయనను నియమించినట్లు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుంటే.. సాంకేతికంగా రమేష్కుమార్ మొదటి నియామకమే సరి కాదనే విషయాన్ని హైకోర్టు పరోక్షంగా వెల్లడించినట్టేనని పేర్కొంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకే రమేష్ కుమార్ నియమితులు అయ్యారని, అది కూడా చెల్లదని అభిప్రాయపడింది.
హైకోర్టు తన తీర్పును తానే ఉల్లంఘించినట్టుగా
ఎన్నికల కమిషనర్ నియామకం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని తన తీర్పులో స్పష్టం చేసిన హైకోర్టు.. గత ప్రభుత్వం నియమించిన రమేష్ కుమార్ను ఎన్నికల కమిషనర్గా పునర్నియమించాలని ఎలా ఆదేశించగలుగుతుందని ఏపీ ప్రభుత్వం తన పిటీషన్లో ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం అంటే తమ ప్రభుత్వం మాత్రమే కాదని గుర్తు చేసింది. దీని ప్రకారం చూస్తే హైకోర్టు తన ఒకే తీర్పు పాఠంలో పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను పొందుపరిచినట్టేనని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. సాంకేతికంగా అనేక లోటుపాట్లు ఉన్న ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది.
Recommended Video
మంత్రిమండలి తీర్మానాలు, సిఫారసుల మేరకే
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243లోని కొన్ని సెక్షన్ల ప్రకారం ఎన్నికల కమిషనర్ నియామకం పూర్తిగా గవర్నర్ విచక్షణ మేరకే ఉంటుందని హైకోర్టు తన తీర్పులో పేర్కొందని, మంత్రి మండలి చేసిన తీర్మానాలు, సిఫారసులను గవర్నర్ ఆమోదిస్తారనే విషయాన్ని తాము గుర్తు చేయాల్సి వచ్చిందని ప్రస్తావించింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా తాము ఆర్డినెన్స్ను తీసుకొచ్చామని స్పష్టం చేసింది. ఈ ఆర్డినెన్స్ను ప్రశ్నిస్తూ సంబంధం లేని వ్యక్తులు దాఖలు చేసిన పిటీషన్పై హైకోర్టు విచారణ చేపట్టిందని విషయాన్ని పొందుపరిచింది ఏపీ ప్రభుత్వం. ఈ స్పెషల్ లీవ్ పిటీషన్ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. త్వరలో ఇది విచారణకు రానుంది.