ఆలీకి కీలక పదవి..! టీటీడి బోర్డ్ సభ్యుల ఎంపికపై కసరత్తు చేస్తున్న జగన్..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పదవుల పంపిణీ సిజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవుల తర్వాత మిగిలిన నామినేటెడ్ పదవుల పైన సీఎం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. పవర్ ఫుల్ పదవిగా చెప్పే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవి తర్వాత అందరి చూపు ఇప్పుడు బోర్డ్ సభ్యులపై పడింది. ఈ కీలక పదవుల్లో ఎవరికి అవకాశం కల్పించాలా అనే అంశం పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
గజన్ కు అత్యంత సన్నిహితులే కాకుండా వివిధ రాష్ట్రాలనుండి వస్తున్న పైరవీలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని జగన్ సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవే విషయంపై జగన్ తుది నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులు త్వరలో జారీ కానున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా సినీ హాస్య నటుడు ఆలీకి కూడా కీలక పదవి కట్టబెట్టేందుకు సీఎం జగన్ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
చంద్రబాబు ప్రభుత్వం చివరి రోజుల్లో, ఎన్నికల కీలక తరుణంలో విపక్ష వైసీపీకి అండగా నిలిచిన సినీ ప్రముఖులను సీఎం జగన్ మర్చిపోలేదు. వారికి సముచిత రీతిలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. వారిని సంతృప్తిపరిచేందుకు పదవులు పంచుతున్నారు. టాలీవుడ్ పెద్దలంతా చంద్రబాబు వెంట ఉంటే.. ఫృథ్వి, అలీ, జీవిత రాజశేఖర్, పోసాని వంటి కొందరు మాత్రం జగన్ సీఎం కావాలని కోరుకున్నారు. ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఎన్నికలకు నెల ముందే జగన్ కు కమెడియన్ అలీ జై కొట్టారు. ఎవరు మంత్రి పదవి ఇస్తే వారి పార్టీలోనే చేరతానని తొందరపాటుగా ప్రకటించడం ద్వారా కొంత ఇబ్బంది పడ్డారు. చివరికి, వైసీపీలోనే చేరారు.
అలీ ఎమ్మెల్యే టికెట్ హామీపైనే వైసీపీలో చేరినా లాస్ట్ మినట్ లో జగన్ ఇవ్వలేకపోయారు. ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారట. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. నామినేటెడ్ పోస్టులపై జగన్ దృష్టి సారించారు. కమెడియన్ పృథ్వీకి తిరుమల తిరుపతి దేవస్థానం టీవీ (ఎస్వీబీసీ) చానెల్ చైర్మన్ పదవిని ఇవ్వబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వైసీపీ గెలుపు కోసం పాటుపపడిన అలీ ఇప్పుడు వైసీపీ పెద్దలను తన సంగతేమిటని సుతిమెత్తగా కోరినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీగానీ, ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ పదవిగానీ ఇవ్వొచ్చని సమాచారం. ఫృథ్వీని కరుణించిన జగన్ అలీపై కూడా త్వరలోనే దృష్టి సారిస్తారనే చర్చ జరుగుతోంది.