సీఎం జగన్ ఆదేశాలనే పట్టించుకోలేదా?: ఏపీ సీఎస్ బదిలీ వెనుక కొత్త కోణాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేయడం రాష్ట్రంలో చర్చనీయంశంగా మారింది. ఎవరూ ఊహించని రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు సీఎస్కు షాకివ్వడంతో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
చంద్రబాబు కష్టం పగోడికీ రాకూడదు: 'ప్యాకేజీ స్టార్' అంటూ పవన్పై విజయసాయి తీవ్ర విమర్శలు
ఇప్పటి వరకు కూడా సీఎస్ స్థాయి అధికారిని ఈ తరహాలో బదిలీ చేసిందే లేదంటున్నారు. ఇది ఇలావుండగా, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ నిర్ణయం వెనుక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సీఎస్ వ్యవహరించిన తీరు, బదిలీకి దారితీసిన పరిణామాలు ఇప్పుడు ఏపీలో రాజకీయంగానూ హాట్ టాపిక్గా మారాయి.
సీఎం ఆదేశాలు బేఖాతరు...?
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పినా అధికారుల పోస్టింగులను కూడా సీఎస్ పక్కన పెట్టినట్లు సమాచారం. బిజినెస్ రూల్స్ సవరణ, వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల నిర్ణయం సీఎస్ సమక్షంలోనే జరిగాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుల అంశాన్ని కేబినెట్ సమావేశంలో పెట్టాలన్న సీఎం ఆదేశాలను కూడా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బేఖాతరు చేశారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
సీఎం నిర్ణయాలను సవాల్ చేసేలా సీఎస్..?
ముఖ్యమంత్రి సమక్షంలో అంగీకారం తెలిపిన తర్వాత కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ లేదనే పేరుతో సీఎస్ కొర్రీ వేశారని తెలిసింది. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుల విషయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తీరుపై సీఎంగా ఆగ్రహంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం నిర్ణయాలను సవాల్ చేసేలా సీఎస్ వ్యవహారం ఉండటంతో ఆయనను బదిలీ చేయాలనే నిర్ణయానికి వైఎస్ జగన్ సర్కారు వచ్చినట్లు తెలుస్తోంది.
నోటీసులు ఇవ్వడంపైనా..
మరోవైపు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఉన్న అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసు ఇవ్వటం.. దీని పైన పెద్ద ఎత్తున చర్చ జరగటం పైన ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమస్యలు ఉంటే అధికారులు చర్చించి పరిష్కరించుకోవాలని కానీ.. ఇలా సీఎంఓ కార్యదర్శికే లేఖ ఇవ్వటం సరి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఎల్వీ సుబ్రమణ్యంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తప్పించాలని నిర్ణయించారు. ఆయనను ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, కొత్త సీఎస్ వచ్చే వరకూ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆ హోదాలో కొనసాగుతారు. కొత్తగా సీఎస్ రేసులో నీలం సహానీ..శమీర్ శర్మ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
రాజకీయంగా రచ్చ..
మరోవైపు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ విషయంపై రాజకీయంగా దుమారం రేపుతోంది. ఓ వైపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మరోవైపు టీడీపీ నేతలు జగన్ సర్కారు వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కోరి తెచ్చుకున్న అధికారిని ఇలా బదిలీ చేసి పంపించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.