వైసీపీకి షాకిచ్చిన పవన్ కల్యాణ్.. విశాఖ కేంద్రంగా జనసేన స్కెచ్.. బీజేపీపైనా సంచలన వ్యాఖ్యలు..
కొంతకాలంగా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న జనసేన చీఫ్ పవన్ కల్యాన్ మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెంచారు. చాలా గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వస్తూనే.. అధికార వైసీపీని చీల్చే ఎత్తుగడను అమలు చేశారు. తొమ్మిది నెలల కిందట 151 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న వైసీపీ.. స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటుకోవాలని ప్రణాళికలు రచిస్తోండగా.. ఆ పార్టీకి చెందిన కీలక నేతల్ని జనసేనలో చేర్చుకోవడం ద్వారా పవన్ భారీ షాకిచ్చారు.
ఏపీ కొత్త పరిపాలనా రాజధాని విశాఖపట్నం కేంద్రంగానే ఈ చీలికలు చోటుచేసుకోవడం గమనార్హం. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గానికి చెందిన దల్లి గోవిందరెడ్డి నాయకత్వంలో పలువురు జగన్ అభిమానులు, వైసీపీ యువనేతలు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. పార్టీ కార్యాలయంలో యువనేతలకు కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. ఈ సందర్భంగా సంచలన కామెంట్లు చేశారు.
కొత్త నెత్తురు ఎక్కించే తరుణం..
80వ దశకంలో రాజకీయాల్లో చేరి, ఇవాళ వివిధ పార్టీల్లో కీలక నాయకులుగా ఉన్నవాళ్లంతా త్వరలో రిటైరైపోతారని, దాందో ఏర్పడే నాయకత్వ లోటును జనసేన పూరించబోతున్నదని, రాజకీయాల్లోకి కొత్త నెత్తురు ఎక్కించే తరుణం ఇదేనని, జనసేన బలమైన రాజకీయ శక్తిగా రూపుదిద్దుకోవడంలో యువశక్తిదే కీలక పాత్ర అని జనసేనాని పవన్ చెప్పారు. సమస్యలు ఎదుర్కొంటున్న జనం జనసేన ఆఫీసులను ఆశ్రయిస్తుండటం, ఇప్పుడు అధికార పార్టీకి చెందిన నేతలు కూడా జనసైన్యంతో కలవడం గొప్ప సందర్భాలని.. ప్రజల్లో జనసేన పట్ల ఆదరణ పెరుగుతోందనడానికి ఇవే నిదర్శనాలని అన్నారు.
విశాఖపైనే ఫోకస్..
‘‘దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించే జనసేనను స్థాపించాను తప్ప.. తక్కవ సమయంలో లబ్ధిపొందాలనే ఆశతో కాదు. చిన్నప్పటి నుంచి చాలా అవగాహనతో పెరిగిన నాకు.. ఒడిదుడుకుల్ని తట్టుకునే శక్తి ఉంది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి చేరుతున్న మిమ్మల్ని.. పార్టీల వారీగా విభజించి చూడను. నామీద నమ్మకంతో మీరు జనసేనలో చేరడం ఆనందం. నన్ను, నా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటే ఇంకా ఆనందం. నేను పది మందికి మంచి చేసేవాణ్నేకానీ కుట్రపూరిత రాజకీయాలు నా వల్ల కాదు. సాధ్యమైనంత సయమనంతో ముందుకెళదాం. ప్రధానంగా విశాఖపట్నంలోని నియోజకవర్గాల్లో జనసేన కీలకంగా వ్యవహరించాలి. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెన్నంటి ఉండాలి''అని పవన్ తెలిపారు.
అందుకే బీజేపీ దిగొచ్చింది..
ప్రజారాజ్యం పార్టీ కొనసాగిన సమయంలో మిత్రపక్షాలను కలుపుకుపోయే విషయంలో ఫెయిల్ అయ్యామని, ఆ అనుభవంతోనే జనసేన పార్టీ 2017 నుంచీ బీజేపీతో మైత్రి కొనసాగిస్తున్నదని పవన్ చెప్పారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జనసేన పార్టీతో.. జాతీయ పార్టీ అయిన బీజేపీ పొత్తుకు ముందుకురావడానికి చాలా బలమైన కారణాలున్నాయన్నారు. ‘‘బీజేపీ దగ్గర భారీ యంత్రాంగం ఉంది. కానీ ప్రజల్ని ఆకట్టుకోగలిగే నాయకులెవరూ ఆ పార్టీలో పెద్దగా లేరు. ప్రజాకర్షణ విషయంలో జనసేనకు ఢోకాలేదు. పైగా, ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా బలపడే సత్తా కూడా ఒక్క జనసేనకే ఉంది. ఇవన్నీ ఆలోచించే పరస్పర లబ్ధికోసం బీజేపీ మనతో పొత్తుకు సిద్ధమైంది''అని పవన్ వివరించారు.
Recommended Video
పాతికేళ్ల ప్రయాణం..
రాజకీయంగా ఇప్పుడు నడుస్తున్న కాలం చాలా కీలకమైందని, వైసీపీ నుంచి జనసేనలో చేరేవాళ్లను పార్టీల దృష్టితో చూడబోనని పవన్ కల్యాణ్ చెప్పారు. పొలిటికల్ బెనిఫిట్స్ కోసం కాకుండా.. ప్రజలకు మేలు చేయాలనుకునే వాళ్లకు, పని చేసే శక్తి మెండుగా ఉన్నవాళ్లందరికీ జనసేన స్వాగతం పలుకుతుందని తెలిపారు. వైసీపీ నుంచిగానీ మరే ఇతర పార్టీ నుంచి కొత్తగా జనసేనలో చేరేవాళ్లతో కనీసం పాతికేళ్లు కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటానన్నారు. చేరికల కార్యక్రమంలో దల్లి గోవిందరెడ్డి, గాజువాక నియోజకవర్గ జనసేన ఇన్ చార్జి కోన తాతారావు, పదులు సంఖ్యలో యువత పాల్గొన్నారు.