డైమండ్ కొంటామని వచ్చి...లాక్కుని పారిపోయారు...చివరకు దొరికిపోయారు...
గుంటూరు జిల్లా: వజ్రాన్ని కొంటామని వచ్చారు...చూపిస్తుంటే ఒక్కసారిగా సినీ ఫక్కీలో లాక్కొని పరారయ్యారు...పక్కనే సిద్దంగా ఉంచిన కారులో పారిపోయారు...అయితే టైమ్ బ్యాడో...లేక అనుభవం లేకనో ఛేజింగ్ లో దొరికిపోయారు...వజ్రం అమ్మి డబ్బులు లెక్కద్దామనుకున్న ఈ కేటుగాళ్లు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు. గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది.
గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన ఖాశింపీరా వజ్రాల వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవలే వేరే ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చిన ఖాసింపీరా చామర్రు రోడ్డులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతని వద్ద ఉన్న ఒక వజ్రాన్ని కొనుగోలు చేసేందుకని గుంటూరుకు చెందిన ప్రవీణ్రెడ్డి, పృధ్వీ గోపిచంద్ శనివారం ఖాశింపీరా ఇంటికి వచ్చారు. ఖాశింపిరా వారికి వజ్రాన్ని చూపిస్తుండగా ఒక్కసారిగా లాక్కుని పరుగెత్తి తమతో తెచ్చిన కారు ఎక్కి పరారయ్యారు. దీంతో అవాక్కయిన ఖాశింపీరా పెద్ద పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు కొందరు ద్విచక్రవాహనాలపై వారిని వెంబడించారు.
అనంతరం స్థానికుల ద్వారా ఈ సమాచారం అందుకున్న పోలీసులు కూడా కారులో పరారవుతున్నవారిని వెంబడించారు. నిందితుల కారు కృష్ణానది రేవు వైపు మళ్లించగా అక్కడ కారు ఇసుకలో దిగబడిపోవడంతో చివరకు పట్టుబడ్డారు. వారిని అచ్చంపేట పోలీస్స్టేషన్కు, అనంతరం జిల్లా ఎస్పి కార్యాలయానికి తరలించారు. వజ్రం నీకెక్కడదని పోలీసులు ఖాసింపీరాను ప్రశ్నించగా తాను వజ్రాన్ని రూ.10 లక్షలకు కొనుగోలు చేశానని, ప్రభుత్వ అనుమతి కూడా ఉందని తెలిపాడు.