KIA క్యా కియా: ఏపీ ప్రభుత్వానికి షాక్..తమిళనాడుకు తరలింపు ? ఏం జరుగుతోంది..?
Recommended Video
అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన దక్షిణకొరియా ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతోందా...? కియాకు వచ్చిన సమస్యలేంటి..? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా..? ఇప్పటికే ఏపీలో ఉన్న ప్లాంట్ నుంచి కార్ల ఉత్పత్తి కూడా పూర్తవుతోంది. మరి ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్టును మరో రాష్ట్రానికి తరలించాలని కియా యాజమాన్యం ఎందుకు భావిస్తోంది..?
తమిళనాడుకు కియా మోటార్స్ తరలింపు..?
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెనుగొండలో అట్టహాసంగా ప్రారంభమైన దక్షిణకొరియా ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రైటర్స్ ఈ కథనం ప్రచురితం చేసింది. కియా సంస్థ ఏడాదికి 3లక్షల యూనిట్ల ఉత్పాదనే లక్ష్యంగా కంపెనీని ప్రారంభించింది. అంతేకాదు ప్రత్యక్షంగా పరోక్షంగా 12వేల ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే కియా మోటార్స్ ఏపీని వీడి తమిళనాడుకు తరలిపోతోందన్న వార్త షికారు చేస్తోంది. ఇప్పటికే ఆ యాజమాన్యం తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందంటూ రైటర్స్ పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది.
తమిళనాడు సర్కార్తో ప్రాథమిక చర్చలు..?
ఆంధ్రప్రదేశ్లో కియా మోటార్స్ యాజమాన్యం పలు ఇబ్బందులు పడుతోందని ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు జరుపుతోందని తమిళనాడు ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లు రైటర్స్ తన కథనంలో పేర్కొంది. అంతేకాదు సెక్రటరీ స్థాయి మీటింగ్ వచ్చేవారం జరుగుతుందని ఆ అధికారి చెప్పినట్లు రైటర్స్ తన కథనంలో వెల్లడించింది. భారత విపణిలో కియాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని తన లక్ష్యాలను అందుకునేందుకు ఆంధ్రా ప్లాంట్ను విరివిగా ఉపయోగించుకుంటామని కియా ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
హుందాయ్ సంస్థ మధ్యవర్తిత్వం చేస్తోందా..?
ఇదిలా ఉంటే ప్రస్తుతం పెనుగొండలో ఉన్న కియా మానుఫాక్చురింగ్ యూనిట్ను ఎక్కడికి మార్చేది లేదని స్పష్టం చేసింది. అయితే తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలపై మాత్రం యాజమాన్యం లేదా సంబంధిత అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక కియా తరపున హుందాయ్ మోటార్స్ అధికారులు తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఆ ప్రభుత్వం ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అంతేకాదు హుందాయ్ కంపెనీకి కియా కంపెనీకి సంబంధాలు ఉన్నాయి. ఇక హుందాయ్ కంపెనీ తన కార్ల ఉత్పత్తి కేంద్రాలన్నీ తమిళనాడులోనే ఉండటం వల్ల.. కియాను కూడా తమిళనాడుకే తరలించేలా చర్చలు జరుగుతున్నాయని ఆ అధికారి చెప్పారు. అయితే హుందాయ్ మాత్రం ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించిందని రైటర్స్ రాసుకొచ్చింది.
75శాతం స్థానికులకే ఉద్యోగాల నియమంతో ఇబ్బందులు..?
2019లో వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఉండాలన్న నిబంధన తీసుకురావడంతో కియా మోటార్స్ అసంతృప్తితో ఉన్నట్లు రైటర్స్ తన కథనంలో రాసుకొచ్చింది. దీంతో తమకు కావాల్సిన ఉద్యోగస్తులు దొరకరనే భావనలో యాజమాన్యం ఉన్నట్లు రైటర్స్ పేర్కొంది. అంతేకాదు కియా ప్లాంట్ ఏర్పాటుకు గత ప్రభుత్వం ఎలాంటి మినహాయింపులు ఇచ్చిందనే దానిపై కూడా సమీక్ష నిర్వహిస్తుండటంపై కూడా కియా యాజమాన్యం అసంతృప్తితో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారమని రైటర్స్ తన కథనంలో పేర్కొంది. మరోవైపు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఒకానొక సమయంలో గొడవ సృష్టించడంపై వార్తలు రావడంతో యాజమాన్యం ఆరా తీసినట్లు సమాచారం. మొత్తానికి తమిళనాడు రాష్ట్రం పక్కనే ఉండటంతో ప్లాంట్ను మార్చేందుకు పెద్దగా ఖర్చు కూడా కాదని యాజమాన్యం భావిస్తున్నట్లు రైటర్స్ వెల్లడించింది.
చంద్రబాబు హయాం విధానాలపై ఆరా
2017లో కియా సంస్థ తన ప్లాంట్ నిర్మాణంను చేపట్టింది. డిసెంబర్లో అధికారికంగా ప్రారంభించింది. మొత్తం 23 మిలియన్ చదరపు అడుగుల్లో ఈ ప్లాంట్ నిర్మాణం జరిగింది. భారత మార్కెట్కు అదే సమయంలో విదేశీ మార్కెట్కు అనుకూలంగా ఇక్కడ కార్లను తయారు చేస్తోంది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు హయాంలో కేటాయించిన భూములు, ఇతర అనుమతులపై విచారణ చేపట్టింది జగన్ సర్కార్. ఈ క్రమంలోనే కియాకు ఇచ్చిన మినహాయింపులపై ఆరా తీస్తోందని రైటర్స్ తన కథనంలో ప్రచురించింది. విద్యుత్ పన్ను మినహాయింపు, భూకేటాయింపులపై ఆరా తీసినట్లు రైటర్స్ కథనంలో రాసుకొచ్చింది.
కియా మోటార్స్ తరలింపు వార్తలను ఖండించిన ఏపీ ప్రభుత్వం
కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతోందంటూ రైటర్స్ పత్రిక కథనం పూర్తిగా అవాస్తవమని అన్నారు పరిశ్రమలు వాణిజ్యం పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ. రైటర్స్లో వచ్చిన కథనాన్ని ఆయన ఖండించారు. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆంధ్రప్రదేశ్పై విషప్రచారం చేయడం సరికాదని అన్నారు. కియా మోటార్స్ ఎక్కడికి తరలిపోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సంస్థకు సహకరిస్తోందని చెప్పారు. ఇలాంటి నిరాధారమైన కథనాలను ప్రజలు విశ్వసించరాదని చెప్పారు.