కియా మోటార్స్ కీలక నిర్ణయం! చైనాలోని కార్ల తయారీ ప్లాంట్ మూసివేత! అనంతపురం ప్లాంట్ పై ప్రభావం?
అమరావతి: దక్షిణ కొరియాకు చెందిన రెండో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ లిమిటెడ్.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది. చైనాలో నెలకొల్పిన అతి పెద్ద కార్ల తయారీ ప్లాంట్ ను మూసివేసింది. మార్కెట్ లో ఆశించిన స్థాయిలో కార్లు అమ్ముడుపోకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. కియా మోటార్స్ తీసుకున్న ఈ నిర్ణయం.. అనంతపురం జిల్లాలో కొత్తగా నెలకొల్పిన కార్ల తయారీ సంస్థపైనా పడే ప్రమాదం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కార్లను సరఫరా చేయడంలో భాగంగా.. కియా మోటార్స్ సంస్థ యాజమాన్యం చైనాలో మూడు చోట్ల కార్ల తయారీ ప్లాంట్లను నెలకొల్పింది. సంవత్సరానికి 8 లక్షల 90 వేల కార్లను తయారు చేయాలనే లక్ష్యంతో కియా మోటార్స్ యాజమాన్యం చైనాలోని జియాంగ్షు ప్రావిన్స్ లో మూడు చోట్ల ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పింది.
తప్పిదాలే శాపాలు..పవన్ దయాదాక్షిణ్యాల కోసం కామ్రేడ్లు: ఉనికి కోసం పాట్లు
జియాంగ్షు ప్రావిన్స్ లోని యాన్ ఛెంగ్ ప్రాంతంలో 2002లో కార్ల తయారీ ప్లాంట్ ను నెలకొల్పింది. 6500 మంది ఉద్యోగులు ఈ ప్లాంట్ లో పనిచేస్తున్నారు. చైనాలో ఏర్పాటైన కియా మోటార్స్ కు చెందిన మొట్టమొదటి ప్లాంట్ ఇదే. డాంగ్ ఫెంగ్ యెడా అనే చైనా సంస్థ ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటైంది. అనంతరం అమ్మకాల్లో వృద్ధి కనిపించడంతో కియా మోటార్స్ యాజమాన్యం.. జియాంగ్షు ప్రావిన్స్ లోనే మరో రెండు చోట్ల ప్లాంట్లను నెలకొల్పింది.
మూడేళ్లలో దారుణంగా పడిపోయిన అమ్మకాలు..
అనేక కారణాల వల్ల కియా కార్ల అమ్మకాలు పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కియా కార్ల అమ్మకాల్లో ఒక్క 2017 ఆర్థిక సంవత్సరంలోనే 44 శాతం మేర క్షీణించాయి. మరుసటి ఏడాది అమ్మకాలు కొద్దిగా మెరుగు పడ్డాయి. 2018 ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాల్లో తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదైంది. అయినప్పటికీ.. చైనాలో కియా కార్ల అమ్మకాలు తిరోగమించాయి.
వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుంటున్నాం:
2017 ఆర్థిక సంవత్సరంలో చైనాలో కనీసం లక్షా 60 వేల కార్లను విక్రయించాలని కియా మోటార్స్ యాజమాన్యం లక్షంగా నిర్దేశించుకుంది. ఆ స్థాయిలో అమ్మకాలు నమోదు కాలేదు. ఈ సంఖ్య 8,20,000 వరకే పరిమితమైంది. దీనితో- ప్లాంట్ ను కొనసాగించడం వల్ల నష్టం వస్తోందనే ఉద్దేశంతో.. యాన్ ఛెంగ్ ప్లాంట్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. యాంగ్ ఛెన్ కార్ల తయారీ ప్లాంట్ నుంచి తాము వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుంటున్నామని కియా మోటార్స్ సంస్థ యాజమాన్యం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మిగిలిన రెండు ప్లాంట్లను కొనసాగించాలా? లేదా? అనేది కార్ల అమ్మకాల మీద ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది.
అనంతపురం ప్లాంట్ పై ప్రభావం చూపుతుందా?
కార్లు ఆశించిన స్థాయిలో అమ్ముడుపోవట్లేదనే ఒకే ఒక్క కారణంతో చైనాలోని యాంగ్ చెన్ ప్లాంట్ ను మూసివేసింది కియా మోటార్స్ సంస్థ యాజమాన్యం. ప్రపంచంలో అత్యధికంగా కార్లు అమ్ముడుపోయే దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న చైనాలోనే ఆ సంస్థ పరిస్థితి అలా ఉంటే.. అనంతపురం ప్లాంట్ సంగతేంటి అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మనదేశంలో కూడా కార్లు పెద్ద సంఖ్యలో అమ్ముడు పోతున్నాయి. ఇది కాదనలేని సత్యం. అమ్ముడు పోతున్న కార్ల ఎక్కువగా మారుతి, రెనో, నిస్సాన్ వంటి సంస్థలకు చెందినవే. కార్ల అమ్మకాల్లో అధిక వాటా మారుతిదే.
మనదేశ రోడ్లపై తిరుగాడే కియా కార్లు సంఖ్య చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ దారులను ఎదుర్కొని.. తమ కార్లను వినియోగదారుల వరకూ చేర్చాలంటే కియా సంస్థ కష్టపడాల్సిందే. అమ్మకాల్లో ఏ మాత్రం క్షీణత కనిపించినా.. ప్లాంట్ ను కొనసాగించే పరిస్థితి లేదంటూ, యాంగ్ చెన్ ప్లాంట్ ను మూసివేయడం ద్వారా కియా మోటార్స్ ఓ సంకేతాన్ని ఇచ్చినట్టయింది. అనంతపురం ప్లాంట్ కూడా సుదీర్ఘ కాలం పాటు నడవాలంటే.. లక్ష్యానికి మించి కార్లు అమ్ముడుపోవాలి. అదొక్కటే అనంతపురం ప్లాంట్ ను రక్షించ గలుగుతుంది.
చంద్రబాబు చేతుల మీదుగా తొలికారు..
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో కియా మోటార్స్ సంస్థ ప్లాంట్ ను నిర్మించింది. కియా కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు కావడం మన దేశంలో ఇదే తొలిసారి. ఇటీవలే ఆ సంస్థ కార్ల తయారీని మొదలు పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా తొలి కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కారుకు నల్లని స్క్రీన్ అమర్చడం వివాదాలకు కేంద్రబిందువైంది. పూర్తిగా తయారు కాని కారును చంద్రబాబు నాయుడు తన ప్రచారం కోసం ఆవిష్కరించారనే విమర్శలు అప్పట్లో చెలరేగాయి. కియా కారు బేసిక్ ధర తొమ్మిది లక్షల వరకు ఉంటోంది. హై ఎండ్ కారు రేటు 16 నుంచి 18 లక్షల వరకు పలుకుతోంది.