ఆత్మీయుల వంచన: కిడారి హత్యకు బంధువులే మావోలకు సమాచారం ఇచ్చారు
విశాఖపట్నం: ప్రభుత్వ ఛీఫ్ విప్ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల హత్య కేసుకు సంబంధించి కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కిడారికి సంబంధిచిన సమాచారం ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉంటున్న వ్యక్తే మావోయిస్టులకు అందించాడని పోలీసులు తెలిపారు. కిడారి ప్రతి అడుగు ప్రతి కదలిక మావోయిస్టులకు సమాచారం ఇచ్చాడని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు కిడారిని బావా అని సంబోధిస్తారట. ఇక ఈయన భార్య డుంబ్రిగూడా మండలంలోని ఓ గ్రామంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో చిరుద్యోగిగా పనిచేస్తోంది. ఈయన మాజీ ఎమ్మెల్యే సోమాకు దగ్గరి బంధువు అని ఇతన్నే ఎరగా వేసి మావోలు కిడారి సోమాలను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఇదిలా ఉంటే పోలీసులు భార్యాభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మరో నిజం కూడా వెలుగు చూసింది. లివిటిపుట్టలో పర్యటించిన మావోలకు వీరు ఆశ్రయం సైతం కల్పించినట్లు సమాచారం. అటవీప్రాంతంలో వారిని కలిసి తినడానికి ఆహారం కూడా సప్లై చేసినట్లు పోలీసులు విచారణ సందర్భంగా తెలిసింది.సర్రాయిలో గ్రామ దర్శని కార్యక్రమానికి కిడారి బయలుదేరారన్న సమాచారం ఆ నాయకుడి ద్వారానే మావోలకు చేరిందని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన కాల్ డేటాను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
కిడారికి సంబంధించిన సమాచారం చెప్పకపోతే తనను చంపేస్తానని బెదిరించడంతో తాను మావోలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఆ నేత చెప్పాడని పోలీసులు వెల్లడించారు. అయితే కిడారికి కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారని తాను అనుకున్నట్లు చెప్పిన నేత ఇలా చంపుతారని మాత్రం ఊహించలేకపోయినట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. కిడారి, సోమల హత్య వెనక మూడు పార్టీలకు చెందిన గ్రామస్థాయి నేతలు కూడా ఉన్నట్లు పోలీసులు విచారణ సందర్భంగా గుర్తించారు. అంతేకాదు వారందరికీ గతంలో మావోలతో సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీరిపై నిఘా వేసినట్లు పోలీసులు తెలిపారు.