సాయిసిద్ధిక్ కిడ్నాప్ విషాదంతం: మాచర్ల శివార్లలోని క్వారీ గుంతల్లో మృతదేహం!
గుంటూరు: జిల్లాలో ప్రకంపలను రేపిన ఆరేళ్ల బాలుడు సాయిసాదిక్ సిద్ధు కిడ్నాప్ ఉదంతం ఊహించని విధంగా విషాదాంతమైంది. జిల్లాలోని మాచర్ల సమీపంలో ఉన్న క్వారీ గుంతల్లో సాయి సిద్ధిక్ మృతదేహం కనిపించింది. క్వారీలో నిల్వ ఉన్న నీటిలో గురువారం ఉదయం ఆ బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన రోజే బాలుడిని హత్య చేసి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఉదంతం వెనుక ఉన్న ఎవరి ప్రమేయం ఉందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మాచర్లలోని నెహ్రూనగర్లో నివసిస్తోన్న వెంకటేశ్వర నాయక్, సరోజ దంపతుల కుమారుడు సాయిసాదిక్ సిద్ధు. వెంకటేశ్వర నాయక్ ఉపాధ్యాయుడు. జిల్లాలోని వెల్దుర్తి మండలం కండ్లకుంటలోని మోడల్ స్కూల్లో పనిచేస్తున్నారు. ఈనెల 22వ తేదీన తన ఇంటికి సమీపంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఆడుకోవడానికి వెళ్లిన సాయి సాదిక్.. సాయంత్రమైనప్పటికీ తిరిగి రాలేదు. దీనితో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అన్నిచోట్లా గాలించినప్పటికీ..బాలుడి ఆచూకీ తెలియ రాలేదు. గుర్తు తెలియని వ్యక్తం ఒకరు సాయి సాదిక్ ను ఎత్తుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
కిడ్నాప్ చేసినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తి సాయి సాదిక్ ను మాచర్ల నుంచి గుంటూరుకు తీసుకెళ్లినట్లు తేలింది. అపహరణకు గురైన మరుసటి రోజు అంటే.. ఈ నెల 23వ తేదీన గుంటూరు రైల్వేస్టేషన్లో సాదిక్ను భుజాలపై ఎత్తుకుని తీసుకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విస్తృత గాలింపు చర్యలు తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతుండగానే.. గురువారం ఉదయం బాలుడి మృతదేహం లభ్యమైంది.
గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి మళ్లీ మాచర్లకు..
సాయిసిద్ధిక్ కిడ్నాప్ నకు గురైన మరుసటి రోజు గుంటూరు రైల్వేస్టేషన్ లో కనిపించినట్లు అక్కడి సీసీటీవీ ఫుటేజీలను బట్టి తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి ఆ బాలుడిని భుజానికెత్తుకుని స్టేషన్ లో తీసుకెళ్తున్నట్లు స్పష్టంగా తేలింది. అదే సమయంలో- మృతదేహం మాచర్ల శివార్లలో లభ్యం కావడం చర్చనీయాంశమైంది. నిందితుడు.. ఆ బాలుడిని మళ్లీ మాచర్లకే తీసుకొచ్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. మరోసారి మాచర్లకు వచ్చాడనడానికి అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. తెలిసిన వారి పనే అయి ఉంటుందనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.