గుంటూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు...కలకలం
గుంటూరు: ఇప్పటికే కల్తీలకు,నకిలీలకు అడ్డగా పేరుతెచ్చకున్న గుంటూరు జిల్లాలో తాజాగా మరో భయంకరమైన దందా వెలుగు చూసింది. మానవ శరీరంలో అతి ముఖ్యమైన కిడ్నీలని కూరగాయల్లాగా కొనుగోలు చేసి అక్రమంగా అమ్ముకుంటున్న వైనం బైటపడింది. గుంటూరులో వైద్యులే సూత్రధారులుగా అధికారులే పాత్రధారులుగా సాగుతున్న ఓ కిడ్నీ రాకెట్ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
గుంటూరు జిల్లాలో ఎన్నాళ్లుగానో సాగుతున్న ఓ కిడ్నీ రాకెట్ గుట్టు ఎట్టకేలకు రట్టు అయింది. ఈ దందా కోసం వైద్యులే ఏకంగా ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేయిస్తుండగా అందుకు అధికారులు సైతం సహకరిస్తున్న వైనం నివ్వెరపరుస్తోంది. మనుషుల పేదరికాన్నిఆసరాగా తీసుకొని వారి కష్టాలనే తమకు పెట్టుబడిగా మలుచుకొని అతి చౌకగా నిరుపేదల నుంచి కిడ్నీలు కొనుగోలు చెయ్యడం, కిడ్నీ సమస్య వచ్చిన సంపన్నులకు వాటిని అధిక ధరకు విక్రయించడం ఇదే ఈ కిడ్నీ రాకెట్ వాణిజ్య రహస్యం.
బైటపడింది ఇలా...
గుంటూరు చంద్రమౌళినగర్ కు చెందిన ఓ వ్యక్తి కిడ్నీల సమస్య రావడంతో చికిత్స కోసం విజయవాడ రోడ్డులోని వేదాంత ప్రైవేట్ హాస్పిటల్ లో చేరాడు. చికిత్స సందర్భంగా అక్కడి వైద్యుడు మీకు రెండు కిడ్నీలు చెడిపోయాయని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఆందోళన చెందగా మీరు కిడ్నీ మార్పిడి చేయించుకోవచ్చని , మీకు కిడ్నీ కావాలంటే నేనే ఏర్పాటు చేస్తానని వైద్యుడు చెప్పడంతో ఆ వ్యక్తి సరేనని అంగీకరించాడు.
కిడ్నీని కొన్నారు...
దీంతో వేదాంత హాస్పిటల్ వైద్యుడు తనకు పరిచయమున్న కిడ్నీ రాకెట్ వ్యక్తులకు సమాచారం అందించడంతో వారు వెంటనే రంగంలోకి దిగి దుర్గి మండలం ఉట్నూరు గ్రామానికి చెందిన నిరుపేద వెంకటేశ్వర నాయక్ అనే వ్యక్తి తో సంప్రదించి అతన్ని కిడ్నీ అమ్మేందుకు ఒప్పించారు. అతనికి కొంత మొత్తం అడ్వాన్స్ గా కూడా చెల్లించారు. దీంతో కిడ్నీ రెడీ కావడంతో ఇక మార్పిడి ప్రక్రియ మాత్రమే మిగిలివుంది.
మార్పిడి ప్రక్రియ...నిబంధనలు...
అయితే కిడ్నీ మార్పిడి కి చట్టప్రకారం నిబంధనలు ఉన్నాయి. కిడ్నీ పాడయిన వ్యక్తికి తన కిడ్నీని ఇవ్వగోరే వ్యక్తి బంధువు అయినట్లయితే ఆ విషయాన్ని ఆర్డివో స్థాయి అధికారి నిర్థారించి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదే బంధువు కాని పక్షంలో జిల్లా కలెక్టర్ ఈ కిడ్నీ మార్పిడికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం జిల్లా కలెక్టర్ వరకు వెళితే ఇబ్బందని, అందులోను జిల్లా కలెక్టర్ కు సిన్సియర్ ఆఫీసర్ గా పేరుండటంతో మొత్తం దందా బైటకి వచ్చే ప్రమాదం ఉందని వీరు ముందు నుంచి వేరే మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
బైటపడింది ఇలా...
దీంతో కిడ్నీ ఇవ్వదలుచుకున్న వెంకటేశ్వర్ నాయక్ ను కిడ్నీ అవసరమైన వ్యక్తి బంధువుగా చూపేందుకు ఆధార్ కార్డ్ ను ఆదారంగా చూపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆధార్ కార్డులో మార్పులు చేసేందుకు నర్సరావుపేట ఎమ్మార్వో కార్యాలయాన్ని అడ్డాగా చేసుకున్నారు. అయితే తాజా ఉదంతంలో డబ్బు పంపకాల్లో తేడాలు వచ్చి ఈ కిడ్నీ మార్పిడి విషయం బైటకు పొక్కింది. పైగా కిడ్నీ విక్రేత అయిన వెంకటేశ్వర్ నాయక్ ఫోటోను రవికుమార్ అనే వ్యక్తి ఆధార్ కార్డు పైకి చేర్చి తద్వారా కిడ్నీ మార్పిడికి అనుమతి పొందాలనే ప్రక్రియ గురించి సమాచారం బైటకు రావడంతో నర్సరావుపేట ఎమ్మార్వో ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు దాఖలు చేసిన ఆధార్ కార్డులోని ఫోటోకు, కింద ఉన్న వివరాలకు ఏ మాత్రం సంబంధం లేని విషయాన్నిఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల విచారణ...
దీంతో ఫిర్యాదును అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాధమిక విచారణలో ఈ కిడ్నీ రాకెట్ ప్రధాన సూత్రధారి గుంటూరు వేదాంత హాస్పిటల్ వైద్యుడేనని తెలిసినట్లు సమాచారం. ఈ వైద్యుడు ప్రధానంగా గుంటూరు-నర్సరావుపేటలను కేంద్రంగా చేసుకొని ఇలా ఇప్పటికే మూడు కిడ్నీలను అమర్చారని, ఇది నాలుగోదని తెలిసింది. ఈ మూడు కిడ్నీలను కూడా నర్సరావుపేట రెవిన్యూ కార్యాలయం నుంచి పొందిన అనుమతుల తోనే మార్పిడి చేసినట్లుగా చెబుతున్నారు. పోలీసులు ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించి నందున అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ కిడ్నీ రాకెట్ తో పాటు తన గుట్టు రట్టవడంతో గుంటూరు వేదాంత హాస్పిటల్ వైద్యుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది.