ఇంగ్లీష్ మాట్లాడలేదని లేడీ టీచర్ తాట తీసింది
హైదరాబాద్: ఆంగ్లభాషలో మాట్లాడలేదని 42 మంది విద్యార్థులపై ఓ ఉపాధ్యాయురాలు వీరంగం వేశారు. మంగళవారం హైదరాబాద్లోని ఎర్రగడ్డలోని డాన్బాస్కో స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులను తెలుగులో మాట్లాడారన్న కారణంగా తనూజ అనే టీచర్ చితకబాదింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూల్ ఆవరణలో ఆందోళన చేపట్టారు.
విద్యార్థులపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులందరూ ఇంగ్లిష్లోనే మాట్లాడే విధంగా చూడాలని ముందుగా అదే తరగతిలోని ఓ విద్యార్థినికి టీచర్ తనూజ చెప్పింది. పిల్లలు ఇంగ్లిష్లో మాట్లాడకపోయేసరికి అదే విద్యార్థినిచేత కొందరు విద్యార్థులను కొట్టించింది. అనంతరం 42 మంది విద్యార్థులపై ఆమె వీరంగం వేసింది.
ముందుగా స్కేల్తో విద్యార్థుల చేతులు, వీపు, కాళ్లపై కందిపోయేలా కొట్టి, తర్వాత పెన్నుతో తమను గుచ్చినట్లు విద్యార్థులు చెప్పారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకొని టీచర్ను విదులనుంచి తొలగించాలని ఆందోళన చేపట్టారు.
విద్యార్థులను విచక్షణా రహితంగా కొట్టిన టీచర్ తనుజపై చర్యలు తీసుకుంటామని కరస్పాండెంట్ ఫాదర్ జేమ్స్ అన్నారు. ఈ విషయమై బుధవారం స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటుచేసి చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యార్థులపై దాడులు చేయడం అమానుషమని బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు అనురాగరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులను చితకబాదిన విషయమై ఫిర్యాదు రాలేదని ఎస్ఆర్నగర్ సీఐ. రమన్గౌడ్ తెలిపారు. దాడి విషయమై విద్యార్ధుల తల్లిదండ్రులు మౌకికంగా చెప్పారేకాని రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదన్నారు.