పోలీసుల అదుపులో డెలాయిట్ మేనేజర్ శ్వేతాబ్, 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం..?
హైదరాబాద్: కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పారిపోయిన శ్వేతాబ్ కుమార్ (డెలాయిట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్)ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. గత పది రోజులుగా పోలీసులు కళ్లు తప్పి తిరుగుతున్న శ్వేతాబ్ కుమార్ చివరకు అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసుల ఒత్తిళ్లతో సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.
దీనిపై గచ్చిబౌలి ఇన్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ శ్వేతాబ్ కుమార్పై ఐపీసీ సెక్షన్ 304 ప్రకారం మర్డర్ కేసు నమోదు చేశామన్నారు. మంగళవారం అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఒక వ్యక్తి మరణానికి కారణమైన శ్వేతాబ్కు జీవితాంతం లేదా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.
శ్వేతాబ్ కుమార్, మార్చి 26న పీకల వరకు మద్యం సేవించి గచ్చిబౌలి - ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారుతో ఐదుగురిని ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదపు వివారాలిలా ఉన్నాయి. సోనీరాం చందానీ (36), హరీష్ ప్రసాద్ (40) ప్రేమ వివాహం చేసుకుని మాదాపూర్లోని విఠల్ రావు నగర్లో ఉంటున్నారు.
భార్య, తనయుడు మోక్ష (4)లతో కలిసి హరీష్ ప్రసాద్ నానక్ రాం గూడ నుంచి గచ్చిబౌలి వైపు ఔటర్ రింగ్ రోడ్డుపై వస్తూ, సిగ్నల్ పడడంతో గచ్చిబౌలి దగ్గర ఆగారు. ఇంతలో వెనుకగా వచ్చిన స్కోడా (టీఎస్09ఈసీ9599) కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో ఎగిరిపడ్డ ప్రసాద్ కుటుంబాన్ని గుద్దుకుంటూ ముందున్న హోండా సిటీ, ఇన్నోవా కార్లను ఢీ కొట్టింది.
దీంతో సోనీరాం, మోక్ష, ప్రసాద్లతో, హోండా సిటీలో ఉన్న ఓ మహిళ, పురుషుడు, స్కోడా కారులోని శ్వేతాబ్ కుమార్, వినోద్, రిషబ్, శ్రీవాత్సవ గాయపడ్డారు. వారిని స్థానికులు హిమగిరి ఆసుపత్రికి తరలించారు.
సోనీరాం కాసేపటికే మృతి చెందగా, ప్రసాద్, మోక్ష తీవ్రగాయాలపాలయ్యారు. స్వల్పగాయాలపాలైన హోండా సిటీలో వారు చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లారు. ఇంతలో అందర్నీ స్కోడా కారుతో ఢీ కొట్టిన శ్వేతాబ్ కుమార్ (డెలాయిట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్) కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పారిపోయాడు.