వైకాపాలోకి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి...ఈసారి ఫిక్స్
శ్రీకాకుళం:శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసిపిలో చేరేందుకు సంసిద్దమయ్యారు. నిజానికి కిల్లి కృపారాణి వైసిపిలో చేరబోతున్నట్లు సుమారు 10 నెలల క్రితమే జోరుగా ప్రచారం జరిగింది.
అయితే నియోజకవర్గం విషయంలో వైసిపి ఇచ్చిన ఆప్షన్ పై తేల్చుకోలేకపోవడంతో పాటు వైసిపి గెలుపుపై పూర్తి విశ్వాసం లేకపోవడంతో ఆమె ఆ పార్టీలో చేరే విషయంలో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ ఎటూ తేల్చుకోలేక పోయారని తెలుస్తోంది. అయితే జగన్ పాదయాత్రకు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపించడంతో ఇక ఇదే మంచి తరుణమని ఆ పార్టీలో చేరేందుకు మానసికంగా సిద్దమయ్యారట.
కిల్లి కృపారాణి...ప్రస్థానం
డాక్టర్ అయిన కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీ తరుపున 2004 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఎంపీగా పోటీచేసి ఓడిపోయింది. ఆ తరువాత 2009 జరిగిన ఎన్నికలలో నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన కింజరాపు ఎర్రన్నాయుడు పై భారీ మెజారిటీతో గెలిచింది. ఆ క్రమంలో కేంద్ర సమాచార మరియు టెలీకమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత.
కబురు అందగానే...గ్రీన్ సిగ్నల్
మరోవైపు గతంలో వైసిపిలో ఎవరైతే చేరేందుకు సుముఖత చూపి ఆ తరువాత సైలెంట్ అయ్యారో ఆ నేతలందరికి వైసిపి నుంచి పార్టీలో చేరే విషయం కబురు వెళుతోందట. అలా కబురు అందగానే కిల్లి కృపారాణి ఈసారి తాను వైసిపిలో చేరేందుకు సంసిద్దమైనట్లు తెలిపారట. అయితే జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నప్పుడు ఆ సమయంలో పార్టీలో చేరాలని భావిస్తున్నారట.
ముందే చేర్చుకోవాలని...వైసిపి
పాదయాత్ర శ్రీకాకుళం చేరేందుకు ఇంకా చాలా వ్యవధి ఉన్నందున కిల్లి కృపారాణిని ముందే పార్టీలో చేరేందుకు వైసిపి ప్రయత్నం చేస్తోందట. అలా వీలుకాని పక్షంలో ముందుగా ఆమెతో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన ఇప్పించాలని ప్రయత్నం చేస్తోందట. అయితే వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నా ఇంకా కిల్లి కృపారాణి ఇంకా డైలమాలోనే ఉన్నారని, అందుకే జగన్ పాదయాత్ర శ్రీకాకుళం చేరుకున్నప్పుడు పార్టీలో చేరుతానని చెబుతున్నట్లు తెలుస్తోంది. అలా అయితే సమీకరణాలు అంచనా వేసేందుకు ఇంకా వ్యవధి దొరుకుతుందని ఆమె ఆలోచన అంటున్నారు.
పోటీ ఎక్కడనుంచి?...
కిల్లి కృపారాణి స్వస్థలం టెక్కలి. ఈ నియోజవకర్గంతో తనకున్న అనుబంధం రీత్యా ఎమ్మెల్యే టికెట్ తనకివ్వాలని కృపారాణి జగన్ ను కోరినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ తరుపున ఇప్పటికే ఆ సీటు కోసం ఇద్దరు పోటీ పడుతుండటంతో వేరే స్థానం గురించి ఆలోచించాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. ఆమె వైసిపిలో చేరితే కళింగ సామాజికవర్గం బలంగా ఉన్న పలాసా నియోజకవర్గం నుంచి ఆమె పోటీకి దిగే అవకాశాలు ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వైసిపిలో చేరే విషయం వీలైనంత త్వరలోనే ఆమెతోనే ప్రకటింపచేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.