వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి, నేడు జగన్తో కృపారాణి భేటీ? కారణాలివే!
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి. పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ కీలక నేతలు కూడా జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది.
జగన్ను కలిసి వైసీపీ తీర్థం
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కృపారాణి కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారని తెలుస్తోంది. ఆయన సమక్షంలో వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కృపారాణి శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా 2004, 2009, 2014లో ఆమె పోటీ చేశారు. 2009లో ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఆమె, కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి అయ్యారు.
తీవ్ర అసంతృప్తి
రాష్ట్ర విభజన, ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గడంతో పాటు టీడీపీతో దోస్తీ అంశాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. కృపారాణి 2014లోనే వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా ప్రచారం సాగింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటే ఆమె కూడా వైసీపీలో చేరతారని భావించారు. కానీ చేరలేదు. ఇక ఇటీవల జగన్ ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురం సభలో కృపారాణి ఫ్యాన్ గూటికి చేరతారని ఊహాగానాలు వచ్చాయి. అప్పుడూ చేరలేదు. ఇప్పుడు మంగళవారం జగన్ను కలిసి పార్టీలో చేరుతారని అంటున్నారు.
హైకమాండ్ దృష్టిలో పడ్డారు
2004లో కాంగ్రెస్ తరఫున శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కృపారాణి ఓడిపోయారు. 2009లో మాత్రం గెలిచారు. నాలుగుసార్లు ఎంపీగా ఉన్న, టీడీపీ కీలక నేత ఎర్రన్నాయుడిని ఆమె ఓడించడం గమనార్హం. దీంతో ఆమె హైకమాండ్ దృష్టిలో పడ్డారు. అనంతరం కేంద్రమంత్రి అయ్యారు. 2014లో ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు.