అచ్చెన్నాయుడితో విభేదాలు, అదే నా వీక్నెస్, బాధేసింది: రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలపై స్పందించారు. తాను ఎంపీగా ఇంకా రాణించాల్సి ఉందని ఆయన చెప్పారు.
తన ప్రసంగాలు బాగుంటాయని, తన పార్లమెంటు ప్రసంగం బాగుందని వస్తున్న ప్రశంసలపై రామ్మోహన్నాయుడు స్పందించారు. తనకు ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తి అని చెప్పారు. వారి ప్రసంగాలు బాగుంటాయని చెప్పారు.
నీకు పోటీ రావాలి కదా? అని.. బాబు అన్నారు..
ఇటీవల జరిగిన ఒంగోలు సభలో చంద్రబాబు బ్రహ్మాండంగా మాట్లాడారని రామ్మోహన్నాయుడు చెప్పారు. కార్యక్రమం అనంతరం చంద్రబాబు హెలికాప్టర్ ఎక్కేటప్పుడు వెళ్లి.. చాలా బాగా ప్రసంగించారు సార్ అని చెప్పానని.. దానికి చంద్రబాబు స్పందిస్తూ.. నీకు పోటీ రావాలి కదా? అని ఆయన అన్నారని రామ్మోహన్నాయుడు చెప్పారు.
అచ్చెన్నాయుడుతో విభేదాలా?
బాబాయి, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో విభేదాలున్నాయని వస్తున్న వార్తల్లో నిజమెంత అని ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని రామ్మోహన్నాయుడు అన్నారు. తాను తన బాబాయి ఇంటి నుంచే ఈ కార్యక్రమానికి వచ్చినట్లు తెలిపారు. తనకు, అచ్చెన్నాయుడుకు గొడవలున్నాయని జిల్లాలో ప్రచారం ఎందుకు జరగుతుందో తెలియదని అన్నారు.
బాబాయి కోప్పడతారు..
తాను ఏ విషయమైనా అచ్చెన్నాయుడికి చెప్పే చేస్తానని రామ్మోహన్నాయుడు తెలిపారు. చెప్పకపోతే కోప్పడతారని, అందుకే అన్ని చెప్పే చేస్తానని తెలిపారు. ఆయనే నాకు మంచి, చెడు చెబుతారని తెలిపారు. తన తండ్రి ఎర్రన్నాయుడుకు కూడా అచ్చెన్నాయుడే గైడ్ చేసేవారని రామ్మోహన్నాయుడు చెప్పారు. మంత్రిగా ఆయన చేసే పని ఆయన చేస్తున్నారని, తాను ఎంపీగా తన పని తాను చేసుకుంటున్నట్లు తెలిపారు. జనాలు మాత్రం వాళ్లకు వాళ్లే అనవసర ప్రచారం చేస్తున్నారని అన్నారు.
అచ్చెన్నాయుడు దూకుడు..
రామ్మోహన్నాయుడు ఏదైనా చెబితే చేయొద్దని అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారని వస్తున్న ఆరోపణల్లో నిజమెంత అని అడిగితే.. అలాంటిదేమీ లేదని అన్నారు. మంత్రిగా అచ్చెన్నాయుడు ఎంతో దూకుడుగా ఉంటారని, ఆయన వేగం తాను అందుకోవాలంటే సమయం పడుతుందని చెప్పారు. ఆయన నుంచి నేర్చుకోవాలని అన్నారు. అచ్చెన్నాయుడు తనకెంతో అండగా ఉంటారని చెప్పారు. జిల్లాలో అచ్చెన్నాయుడు అంతా చూసుకుంటారు కాబట్టే.. తాను ఇంత ఫ్రీగా ఉంటున్నానని తెలిపారు. గ్రామకంఠం భూముల విషయంలో కావాలనే ఇతర పార్టీలు కుట్రలు చేశారని అన్నారు.
10కి 6మార్కులు.. అదే నా వీక్నెస్
తాను ఎంపీగా 10మార్కులకు గాను 6మార్కులు వేసుకుంటానని రామ్మోహన్నాయుడు తెలిపారు. ఇంకా తాను ఇంప్రూవ్ కావాలని చెప్పారు. తెల్లవారుజామునే లేవకపోవడం తన వీక్నెస్ అని రామ్మోహన్నాయుడు చెప్పారు. తాను అర్ధరాత్రి వరకైనా పని చేస్తానని, ఉదయం లేవడం కష్టమని చెప్పారు. అయితే, ఇప్పుడు రాత్రి తొందరగా పడుకుని.. ఉదయం తొందరగా లేచే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. తాను ఇంకొంత అగ్రెసివ్గా ఉండాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు. తన తండ్రితో పోల్చుకుంటే తాను తక్కువేనని అన్నారు.
వారిని చంపడం బాధగా ఉంది..
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఇద్దరు నేతలను నక్సలైట్లు చంపేశారు కదా? భయం లేదా? అని ప్రశ్నించగా... భయం కన్నా, బాధగా ఉందని చెప్పారు. తనకు తండ్రిని కోల్పోయిన బాధ ఉందన్నారు. మనపై మనం విద్వేషాలు పెంచుకోవడం మంచిది కాదని రామ్మోహన్నాయుడు అన్నారు. తన తండ్రి మీద కూడా రెండుసార్లు అటెంప్ట్ చేశారని తెలిపారు.
శ్రీకాకుళంకు యాస వీక్నెస్ కాదు బలం..
తనను స్ఫూర్తిగా తీసుకుని యువకులు రాజకీయాల్లో వస్తే ఇంకేం కావాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని రామ్మోహన్నాయుడు చెప్పారు. ఫిజికల్గా, మెంటల్గా డెవలప్ చేయాలని అన్నారు. జిల్లాకు బలమైన యాసను ఇక్కడి ప్రజలు వీక్నెస్ అనుకుంటున్నారని.. అదే బలమని వారికి చెప్పాలని అన్నారు.
కేంద్రమంత్రి పదవిపై..
రాష్ట్ర మంత్రి కావాలని ఏం లేదా? అని ప్రశ్నించగా.. తాను ఎంపీగానే కొనసాగుతానని అన్నారు రామ్మోహన్నాయుడు. కేంద్రమంత్రి పదవి చేపడతారా? అని ప్రశ్నించగా.. అది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. మంచి పార్లమెంటేరియన్గా ఉంటానని చెప్పారు.