ఇలాంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్గా: ఏపీ గవర్నర్గా కిరణ్ బేడీ, తెలంగాణకు శర్మ?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా కిరణ్ బేడీ రానున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్గా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయన ఒక్కరే ఉన్నారు.
దీంతో ఏదో ఒక రాష్ట్రానికి మరో గవర్నర్ను నియమించాలని చాలారోజులుగా భావిస్తున్నారు. తెలంగాణ, ఏపీలకు కొత్త గవర్నర్లు వస్తారని.. తెలంగాణకు నరసింహన్ ఉంటారని, ఏపీకి కొత్త గవర్నర్ వస్తారని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది.
గతంలోను ఏపీకి కిరణ్ బేడీ పేరు వినిపించింది. ఇప్పుడు మరోసారి ఆమె పేరు తెరపైకి వచ్చింది. ఏపీకి ఆమెను గవర్నర్గా నియమించే అవకాశముందని తెలుస్తోంది. అలాగే తెలంగాణకు మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఇర్రిగేషన్) సీవీఎస్ శర్మ పేరు వినిపిస్తోంది.
రాష్ట్రానికి కొత్త గవర్నర్ను నియమించాలని ఏపీ బీజేపీ అధ్యక్షులు, ఎంపీ హరిబాబు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్కు లేఖ కూడా రాశారు. నరసింహన్ హైదరాబాదులో ఉంటున్నారని, ఏపీకి ప్రత్యేకంగా గవర్నర్ ఉంటే పాలన బాగుంటుందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్గా ఉన్న కిరణ్ బేడీని ఏపీ గవర్నర్గా పంపించాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీకి నిధుల విషయంలో టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్, సరైన గవర్నర్ అవసరమని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఏపీలో రాజ్ భవన్ లేదు. తాత్కాలికంగా గవర్నర్కు సౌకర్యాలు కల్పించవచ్చునని, ఇది సమస్య కాదని కేంద్రం భావిస్తోంది.