నీళ్లు ముట్టని కిరణ్, బొత్స:పోటీలో నెగ్గేదెవరోనని జగ్గారెడ్డి
హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు సత్యనారాయణల మౌన దీక్ష సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ముగింది. దాదాపు నాలుగు గంటల పాటు కిరణ్, బొత్స, మంత్రి గల్లా అరుణ కుమారిలు మంచినీళ్లు కూడా ముట్టలేదు. దీక్ష ముగిసిన అనంతరం బొత్స, కిరణ్ ఇతర నేతలు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాష్ట్రపతిని కలిసేందుకు రాష్ట్రపతి భవన్కు వెళ్లారు.
అంతే పట్టుతో కిరణ్: జగ్గా రెడ్డి
తెలంగాణ విషయంలో తమ పార్టీ అధిష్టానం ఎంత పట్టుదలతో ఉందో, సమైక్య రాష్ట్రం విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంతే పట్టుదలతో ఉన్నారని ప్రభుత్వ విప్ జగ్గా రెడ్డి అన్నారు. ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో కాలమే నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణ వచ్చినా రాకున్నా తాను సంగారెడ్డి నుండే పోటీ చేస్తానని చెప్పారు.
రేపు మరో రాష్ట్రానికి జరగొచ్చు: లగడపాటి
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్కు జరిగిన అన్యాయం రేపు మరో రాష్ట్రానికి కూడా జరగవచ్చునని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ఢిల్లీలో అన్నారు. కేంద్రం ఇప్పటికైనా విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అందరు విభజనను వ్యతిరేకిస్తున్నా కేంద్రం ఎలా ముందుకు వెళ్తుందని ప్రశ్నించారు. విభజన జరిగితే జాతీయస్థాయిలో ఎపికి నష్టం జరిగే అవకాశముందన్నారు. విభజనతో ఎపి ఉనికిని కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన దేశ సమగ్రతకే విఘాతమన్నారు.
అవిశ్వాస తీర్మానంకు మద్దతు: మైసూరా
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతిస్తుందని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి తెలిపారు. గత సమావేశాల్లో నేరుగా తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని ఈసారి మాత్రం స్పీకర్ అనుమతి కోరే సమయంలో తాము లేచి మద్దతు తెలుపుతామన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ, దేశవ్యాప్తంగా పర్యటించి ఇతర పార్టీల నేతలను కలసి సమైక్య ఆకాంక్షను వెల్లడించామని తెలిపారు.