ఐనా కిరణ్ నాకు బాస్ కాదు: శ్రీధర్, ప్రెస్ మీట్పై కెటిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు బాస్ కాదని, ఆయన మీకే బాస్ అని మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్తో అన్నారు. బుధవారం శాసన సభాపతి కార్యాలయం వద్ద ఉన్న శ్రీధర్ బాబు వద్దకు ద్రోణంరాజు వచ్చారు. శ్రీధర్ బాబును ఉద్దేశించి... మన బాస్ వద్దకు వెళ్దాం పద అన్నారు.
ఆయన వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు వెంటనే స్పందిస్తూ... ఆయన మీకే బాస్ అని, తనకు కాదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అందరికీ బాసే కదా అని ద్రోణంరాజు అన్నారు. దానికి శ్రీధర్ బాబు తనకు కిరణ్ కుమార్ రెడ్డి బాస్ కాదని మళ్లీ చెప్పారు.
కిరణ్ ప్రెస్మీట్పై కెటిఆర్
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డును తలపిస్తున్నాయని తెరాస ఎమ్మెల్యే కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఆయన ఏమి చెప్పినప్పటికీ, రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం కేవలం లాంఛనమేనని, రాజ్యాంగంలో ఈ విషయం స్పష్టంగా ఉందని తెలిపారు. కిరణ్ ప్రెస్మీట్ తదుపరి ఎమ్మెల్యే కెటిఆర్ బుధవారం రాత్రి ఇక్కడ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
అసెంబ్లీలో విభజన బిల్లును మెజార్టీ సభ్యులు ఓడించటం అనే ప్రసక్తి ఎక్కడిదని, ఆ బిల్లును రాష్ట్రపతి పంపించింది అభిప్రాయ వ్యక్తీకరణకు మాత్రమే అన్నారు. దేశంలో ఎక్కడాలేని నీతిమాలిన, అనైతిక రాజకీయ నాయకులు కిరణ్, చంద్రబాబు, జగన్ రూపంలో ఇక్కడే ఉన్నారనే విషయం కేంద్రంలోని పెద్దలకు తెలుసునని మండిపడ్డారు.