అప్పుడు బాధపడ్డా, నేను-అన్నయ్య ఒకే పార్టీలో: కిరణ్ రెడ్డి సోదరుడు
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కిషోర్ కుమార్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను కార్యకర్తల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని చెప్పారు.
ఓటర్లు గుర్తించలేదు, మనోవేధనకు గురయ్యా
తన సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.2వేల కోట్లు నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినా ఓటర్లు గుర్తించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు కిషోర్ కుమార్ రెడ్డి చెప్పారు.
అక్కడ కూడా రోడ్డు వేసింది అప్పుడే
ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచినవాళ్లు నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం వలన అభివృద్ధి కుంటుపడిందని కిషోర్ రెడ్డి ఆరోపించారు. చివరకు ఎమ్మెల్యే ఇంటిముందు కూడా సిమెంటు రోడ్డు వేసింది కిరణ్ రెడ్డి ప్రభుత్వం హయాంలోనే అన్నారు.
నేను, కిరణ్ రెడ్డి ఒకే పార్టీలో
అన్ని మండలాల్లో పర్యటించి కార్యకర్తల అభిప్రాయం మేరకు త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని కిషోర్ కుమార్ రెడ్డి చెప్పారు. కొంతమంది తన సోదరుడు కిరణ్ రెడ్డి, తాను మరో పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారని అలాంటి ప్రసక్తే లేదన్నారు.
నారా లోకేష్ ఓకే చెప్పారని
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని, ఇందుకు మంత్రి నారా లోకేష్ ఓకే చెప్పారని ప్రచారం సాగిన విషయం తెలిసిందే.