టీడీపీలోకి సోదరుడు, అక్కడి నుంచే పోటీ: రాజకీయాల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఔట్?
సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ తెలుగుదేశం పార్టీ పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. త్వరలో ఆయన టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమరావతి: సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ తెలుగుదేశం పార్టీ పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. త్వరలో ఆయన టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Recommended Video
'కిరణ్ కుమార్ రెడ్డీ! ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో'
కిషోర్ టీడీపీలో చేరుతారనే ప్రచారం
కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. కానీ అది ప్రచారం వరకే పరిమితమైంది తప్ప ఇప్పటి వరకు చేరింది లేదు. ఇప్పుడు మరోసారి ఈ అంశంపై ప్రచారం సాగుతోంది. అయితే ఈసారి మాత్రం టీడీపీలో చేరడం ఖాయమైందని అంటున్నారు.
ఈ రోజో రేపో టీడీపీలో చేరుతారని
గురువారం లేదా రేపు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తారని చెబుతున్నారు. ఆయన సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో కిషోర్ కుమార్ పీలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రానున్న ఎన్నికల్లో పీలేరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశముందని అంటున్నారు.
చాలా రోజులుగా ప్రచారం
పీలేరులో తన అన్న కిరణ్ రెడ్డి హయాంలో కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేసినా గెలిపించకపోవడంపై మనోవేధనకు గురైనట్లు గతంలో కిషోర్ కుమార్ తెలిపారు. ఏ పార్టీలో చేరాలో త్వరలో నిర్ణయం తీసుకుంటానని కూడా అప్పుడు చెప్పారు. అయితే అప్పటికే ఆయన టీడీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా భావిస్తున్నారు.
కిరణ్ రెడ్డి రాజకీయాల నుంచి ఔట్?
ఇదిలా ఉండగా, కిషోర్ కుమార్ రాజకీయాల్లో చురుకు కానుండగా, కిరణ్ కుమార్ రెడ్డి విరమించుకున్నట్లేనని చాలామంది భావిస్తున్నారు. ఆయన బీజేపీలో చేరుతారని, తిరిగి కాంగ్రెస్లోకి వస్తారని గతంలో పలుమార్లు ప్రచారం సాగింది. కానీ గతంలో సీఎంగా పని చేసిన ఆయనకు ఏ పార్టీలో చేరిన సరైన ప్రాధాన్యత దక్కకుంటే బాగుండదు. కాబట్టి తమ్ముడిని రాజకీయాల్లోకి క్రియాశీలకం చేసి, ఆయన తప్పుకున్నట్లుగా భావించవచ్చునని అంటున్నారు.