మంచి రోజులు ముందున్నాయి: కిరణ్ కుమార్ రెడ్డి భరోసా
చిత్తూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎస్పీ అధినేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలకు భరోసారి ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దని మనకు మంచిరోజులు ముందున్నాయని ఆయన అన్నారు.
వాల్మీకిపురంలోని మార్కెట్ కమిటీ మాజీ ఛెర్మన్ దివంగత కోసూరి నరసింహులు కుటుంబసభ్యులను సోదరుడు నల్లారి కిషోర్కుమార్రెడ్డి, మార్కెట్కమిటీ మాజీ ఛెర్మన్ కంభం నిరంజన్రెడ్డితో కలిసి గురువారం ఆయన వారిని పరామర్శించారు.
మృతుడు కోసూరి నరసింహులు కుమారులు చంద్రమౌళి, వాసులను మాజీ సీఎం పలకరిస్తూ తండ్రి మరణంతో అధైర్యపడొద్దని, ధైర్యంగా ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు.
త్వరలోనే మనకు మంచిరోజులు రానున్నాయని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన బెంగుళూరుకు బయలుదేరివెళ్లారు. ఈ కార్యక్రమంలో సర్పంచి రాజేంద్రచారి, జేఎస్పీ నాయకులు పాల్గొన్నారు.