మీరూ చెప్పండి: కిరణ్కు పిలుపు, ఇవే అడిగానని వట్టి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రుల బృందం(జివోఎం) నుండి పిలుపు వచ్చింది. విభజన నిర్ణయం నేపథ్యంలో తమ ఎదుట హాజరు కావాలని జివోఎం సూచించింది. గురువారం రాత్రి ఎనిమిది గంటలకు ముఖ్యమంత్రి జివోఎంతో భేటీ కానున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న జివోఎం తాజాగా కిరణ్ అభిప్రాయాన్ని తీసుకోనుంది. రేపు సాయంత్రం జివోఎం సభ్యులు భేటీ కానున్నారు.
ఇవే అడిగా: వట్టి
జివోఎం సభ్యుల ముందు తాను సమైక్యాంధ్ర వాదాన్ని వినిపించానని మంత్రి వట్టి వసంత్ కుమార్ న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని, అదే విషయాన్ని వారికి చెప్పానన్నారు. విభజన జరిగితే పలు సమస్యలను ఎలా పరిష్కరిస్తారని తాను అడిగానన్నారు.
హైదరాబాదులో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లా సీమాంధ్రలో రాజధానిని ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించానన్నారు. సీమాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధి సంగతిని అడిగానన్నారు. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం హైదరాబాదు నుండే వస్తుందన్నారు. అలాంటి హైదరాబాదును తెలంగాణలో కలిపేస్తే సీమాంధ్రకు వచ్చే అరవై శాతం వాటాను ఇవ్వగలరా అని ప్రశ్నించానన్నారు.
ఒక రాష్ట్రం ఆదాయం మరో రాష్ట్రానికి ఇచ్చే అవకాశం రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. ఒక ప్రాంతానికి న్యాయం చేసే దిశలో మరో ప్రాంతానికి అన్యాయం చేయవద్దన్నారు. విభజన చేస్తే హైదరాబాదులోని, తెలంగాణలోని సీమాంధ్రుల భద్రత ఎలా అన్నారు. విభజన అనివార్యమైతే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కోరినట్లు చెప్పారు. న్యాయపరంగా అయితే విభజన సాధ్యం కాదన్నానని తెలిపారు. విభజిస్తే ఉద్యోగులు, విద్యార్థులు, యువత నష్టపోతుందన్నారు.