టి ఎందుకో చెప్పండి, పదవి ఏమైనా పర్లేదు: ఢిల్లీపై కిరణ్
విశాఖపట్నం: ఎవరి కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారో చెప్పాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పెద్దలను ప్రశ్నించారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లా రచ్చబండ కార్యక్రమంలో ఆయన మరోసారి సమైక్యవాణిని వినిపించారు. విభజనతో కేవలం సీమాంధ్రకే నష్టం జరుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారని అది తప్పని తెలంగాణకే ఎక్కువ నష్టమని ఆయన వ్యాఖ్యానించారు.
విభజనకు అనుకూలంగా కేంద్రం దురదృష్టకరమైన నిర్ణయం తీసుకుందన్నారు. సీమాంధ్ర ప్రజల హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు. అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చాకనే కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని అయినా తాము దానిని వ్యతిరేకిస్తున్నామన్నారు. తన పదవి ఏమైనా నేను లెక్క చేయనని, సమైక్య రాష్ట్రం కోసమే ప్రయత్నాలు చేస్తానన్నారు.
రెండు ప్రాంతాలకు నష్టం జరుగుతుందంటే ఎలా విభజిస్తారని, కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజనను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని చెప్పే వరకు పోరాటం కొనసాగిద్దామని ప్రజలకు సూచించారు. తన పదవి ఏమైనా సమైక్యాంధ్రే కోరుకుంటానన్నారు. దానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. విభజన జరిగితే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో మనది ఒకటి అన్నారు.
రచ్చబండ రగడ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖ రచ్చబండ కార్యక్రమం ద్వారా మంత్రుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. గంటా శ్రీనివాస రావు రచ్చబండ కార్యక్రమాన్ని మరో మంత్రి బాలరాజుకు తెలియకుండా రూపొందించేరని ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని బాలరాజుకు తెలిపినట్లు సిఎం కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.