కిరణ్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు, ఢిల్లీలో రాహుల్-సోనియాలతో భేటీ!
Recommended Video
చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకు ముహూర్తం దాదాపు ఖరారయిందని తెలుస్తోంది. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి తీసుకు వచ్చేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు మంతనాలు జరిపిన విషయం తెలిసిందే.
ఇది సఫలమైనట్లుగా తెలుస్తోంది. పళ్లంరాజు, టీ సుబ్బిరామిరెడ్డి వంటి వారు కిరణ్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత ఆయన కూడా ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఊమెన్ చాందీని కలిశారు. తాను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఇప్పుడు ముహూర్తం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది.
ఈ నెల (జూలై) 13వ తేదీన ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీలో చేరడానికి ముందు ఆయన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలవనున్నారు.
పార్టీలో చేరికపై ఆయన వారితో చర్చించనున్నారు. తాను పార్టీలో చేరితే పోషించాల్సిన పాత్రపై చర్చలు జరపనున్నారు. తొలుత పార్టీ ముఖ్య నేతలను కలవనున్నారు. ఆ తర్వాత రాహుల్, సోనియా గాంధీలను కలిసి ఓ నిర్ణయానికి వచ్చాక ప్రకటన చేయడం లేదా నేరుగా చేరే అవకాశాలున్నాయి.
కిరణ్ రెడ్డి సెటైర్
ఈ నెల 13న కాంగ్రెస్ పార్టీలో చేరికపై కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. తాను ఈ వార్తలను టీవీ ఛానెళ్లలో చూసి తెలుసుకుంటున్నానని సెటైర్ వేశారు. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.