25 సీట్లు ఇవ్వండి, సమైక్యంగా ఉంచుతా: కిరణ్ రెడ్డి
రాజమండ్రి: తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలపై మాజీ ముఖ్యమంత్రి, జై సమైకాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజమండ్రిలో బుధవారం సాయంత్రం జరిగిన పార్టీ ఆవిర్భావ సదస్సులో ఆయన ప్రసంగించారు. గోదావరి జిల్లాల దెబ్బ కాంగ్రెసు పార్టీకి తెలియదని ఆయన అన్నారు. గోదావరి జిల్లాల ప్రజలు ఓటేసినవారే అధికారంలోకి వస్తారని అన్నారు. తమకు 25 పార్లమెంటు స్థానాలు ఇస్తే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు.
జైరాం పిచ్చి మేధావి
కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఒక పిచ్చి మేధావి అని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణకు ఇంకా నష్టం జరగబోతోందని ఆయన అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, అందుకే రాజీనామా చేశానని, పదవి కోసం కొత్త పార్టీ పెట్టలేదని ఆయన అన్నారు. తనకు కాంగ్రెసు బీ ఫారం అవసరం లేదని, తనకు ప్రజల బీ ఫారం కావాలని ఆయన అన్నారు.
ఎవరు సిఫార్సు చేశారని రాష్ట్రాన్ని విభజించారని ఆయన అడిగారు. రాష్ట్రాన్ని ఈ రీతిలో విభజించడం సమంజసమా అని కిరణ్ రెడ్డి అడిగారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర, తెలంగాణల్లో విద్యార్థులకు ఉన్నత విద్యలో ఇబ్బందులు వస్తాయని ఆయన అన్నారు.
అందరూ బాధ్యులే...
రాష్ట్రంలో ఓ పక్క తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మె, రైల్ రోకో వంటి ఆందోళన కార్యక్రమాలు నడుస్తున్నా తాను అభివృద్ధి సాధించానని ఆయన చెప్పుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు, బిజెపి, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలన్నీ విభజనకు బాధ్యులేనని ఆయన అన్నారు.
శాసనసభ తిరస్కరించిన బిల్లును ఎప్పుడైనా పార్లమెంటులో పెట్టారా అని కిరణ్ రెడ్డి అడిగారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలను సస్పెండ్ చేశారని, కొందరిపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. తలుపులు మూసుకుని లోకసభలో బిల్లును ఆమోదించారని ఆయన తప్పు పట్టారు. 1962 నుంచి ఇప్పటి వరకు 12 ఎన్నికల్లో తమ కుటుంబం కాంగ్రెసు పార్టీకి అండగా నిలిచి పోటీ చేసిందని చెప్పారు.
సోనియా అడిగితేనే అంగీకరించా..
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అడిగితేనే తాను ముఖ్యమంత్రి పదవికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. పదవి ఇచ్చారని చెప్పి రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకోవాలా అని ఆయన అడిగారు. సిఎం పదవి ఇచ్చారని చేతులు కట్టుకుని కూర్చోవాలా అని అడిగారు. తాను ఎటువంటి స్థితిలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిందీ ఆయన వివరించారు. విభజన వద్దని తాను సోనియాకు, రాహుల్ గాంధీకి చెప్పానని, కాని వినలేదని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని విభజించాలని వైయస్ జగన్, చంద్రబాబు లేఖలు ఇచ్చారని, ఇప్పుడు తాము దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. పెద్దమ్మ సోనియా, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ కలిసి రాష్ట్రాన్ని విభజించారని ఆయన అన్నారు. తల్లిని చంపి తెలంగాణ ఇచ్చారని నరేంద్ర మోడీ అన్నారని గుర్తు చేస్తూ మరి ఎందుకు తెలంగాణ బిల్లు ఆమోదానికి బిజెపి సహకరించిందని ఆయన అడిగారు.
శాసనసభ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం తెలపడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లామని, తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు సొంత మామను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యారని, రాష్ట్రం ఐక్యంగా ఉండాలని ఒక్కసారి కూడా అనలేదని కిరణ్ రెడ్డి విమర్శించారు. కేసులను మాఫీ చేసుకోవడం, ముఖ్యమంత్రి కావడమే జనగ్ లక్ష్యమని ఆయన అన్నారు.