చంద్రబాబు చాలా తెలివైనవారు: కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కళ్యాణ్కు బొత్స గట్టి కౌంటర్
అనంతపురం: కాంగ్రెస్ పార్టీతోనే విభజన హామీలు సాధ్యమవుతాయని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనంతపురంలో అన్నారు. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చాలా తెలివైన వారని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే నవ్యాంధ్రకు మేలు జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిశారని చెప్పారు.
తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనేది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కోరిక అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన, వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఏ జట్టులో ఉంటాయో తేల్చుకోవాలని మాజీ సీఎం అల్టిమేటం జారీ చేశారు.
అధికార పార్టీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్: బొత్స
తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసు అంశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ కూడా అలాగే మాట్లాడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ వేరుగా విమర్శించారు. అధికార పార్టీ డైరెక్షన్లో ఆయన నడుస్తున్నారన్నారు.
తను ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి విమర్శలు చేయడం కాదన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల తరపున పోరాడాలని సూచించారు. తనకు కులాలతో సంబంధం లేదని చెబుతూనే వాటి గురించి పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఎదిరించానని గొప్పలు చెప్పుకుంటున్న పవన్, అసలు ఆయన అప్పుడు రాజకీయాల్లో ఉన్నారా? అని ప్రశ్నించారు.