తెరాసకు కిరణ్ హితబోధ, జగన్ పార్టీకి టిడిపి సపోర్ట్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన శాసన సభలో మంత్రి వట్టి వసంత్ కుమార్ మాట్లాడుతుండగా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. విభజన అంశం చాలా సున్నితమైన విషయమని, మాట్లాడుతుండగా ఎవరూ అడ్డుకోవద్దన్నారు. వట్టి చెప్పేది మీకు వాస్తవం అనిపిస్తే అనుకోండి లేదా కాదనుకుంటే కాదనుకోండన్నారు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చునన్నారు.
ముఖ్యమైన అంశంపై చర్చ జరిగేటప్పుటు ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దన్నారు. రాజ్యాంగ పద్ధతి ప్రకారం చర్చ జరుపుకుందామన్నారు. సభను తొమ్మిది కోట్ల మంది ప్రజలు చూస్తున్నారనే విషయం తెలుసుకోవాలన్నారు. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు అడ్డుకోవద్దన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి టిడిపి సపోర్ట్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులను అరెస్టు చేయడాన్ని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన విషయం తెలియడంతో టిడిపి ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర సభలో మాట్లాడుతూ... వారిని అరెస్టు చేయడం సరికాదని, సభలో అభిప్రాయాలు చెప్పే అవకాశం అందరికీ ఉందని, వారు తమ అభిప్రాయం చెప్పాల్సిన అవసరముందని, వారిని అరెస్టు చేయడం సరికాదన్నారు.