ఢిల్లీకి సవాల్: బాబు, జగన్లకు ధీటుగా ప్రజల్లోకి కిరణ్?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ జిల్లాల పర్యటనలకు సన్నద్ధమవుతున్నారట. ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నారని సమాచారం. త్వరలో కిరణ్ మరో విడత రచ్చబండ ప్రారంభం కానుంది. రచ్చబండ పేరిట ప్రజల్లోకి వెళ్లాలని కిరణ్ భావిస్తున్నారట.
రచ్చబండ రెండో దశ కార్యక్రమాన్ని ఆగస్టులోనే చేపట్టాల్సి ఉంది. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు లక్షలాదిగా లబ్ధిదారులకు మంజూరు చేయాల్సి ఉంది. అయితే, జూలై 30న తెలంగాణకు సానుకూలంగా సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది.
దీంతో, జిల్లా పర్యటనలను ముఖ్యమంత్రి వాయిదా వేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం సీమాంధ్రలో ఎపిఎన్జీవోలు సమ్మె విరమించడంతో సహచర మంత్రులతో సమావేశమై జిల్లా యాత్రలపై కిరణ్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్రం అంతటా తిరగాలంటే రచ్చబండ కార్యక్రమం ఒక్కటే సరైనదిగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరుతున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోనూ మంత్రులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో సమైక్యాంధ్ర నినాదంతో సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించాలని ఆ ప్రాంత ప్రజా ప్రతినిధుల నుంచి కిరణ్పై ఒత్తిడి పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో సహచర మంత్రులతో సమావేశమై రచ్చబండ లేదా జిల్లా యాత్రలపై ఒక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళుతున్న కిరణ్ సీమాంధ్ర ప్రాంతంలో విభజనను ఆపేందుకు వారి సహకారం కోరే అవకాశం లేకపోలేదంటున్నారు.
కిరణ్ రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్లి విభజన అంశాన్ని ప్రస్తావిస్తే అధిష్టానానికి చిక్కులు తీసుకు వచ్చినట్లేనని, అది పరోక్షంగా ఢిల్లీ పెద్దలకు సవాలే అంటున్నారు. విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ఢిల్లీలో ఆదివారం మాట్లాడుతూ కిరణ్ ప్రజల్లోకి వెళ్తారని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే జగన్, చంద్రబాబులు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.