ఢిల్లీలో కిరణ్ కుమార్ రెడ్డి: రేపు రాహుల్ గాంధీతో భేటీ, కాంగ్రెస్ తీర్థం!
న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైపోయింది. ఆయన శుక్రవారం ఉదయం 11.30గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు.
జులై 13న రాహుల్ గాంధీ సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఇటీవల ఆ పార్టీ శ్రేణులు తెలిపిన విషయం తెలిసిందే. కిరణ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు ఏపీ రాజకీయ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది.
శుక్రవారం రాహుల్ గాంధీతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ సందర్భంగా ఏపీసీసీ వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా హాజరుకానున్నారు. రాహుల్ గాంధీతో చర్చల అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికపై స్పందించే అవకాశం ఉంది.
కాగా, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ 2 ప్రత్యేక తెలుగు రాష్ట్రాలను ఏర్పాటు చేయడంతో ఆ పార్టీని వీడారు. జై సమఖ్యాంధ్ర పార్టీ స్థాపించి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, ఆ పార్టీకి ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు.
ఈ క్రమంలో గత కొంతకాలంగా కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మల్లీ 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.