ఒక్కటే మార్గం: బిజెపి వైపు చూస్తున్న కిరణ్ రెడ్డి?
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసుతో పాటు జై సమైక్యాంధ్ర పార్టీ కూడా ఘోరంగా విఫలమయ్యాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు.
తన సొంత నియోజకవర్గం పీలేరులో తన సోదరుడిని నిలిపారు. కానీ ఆయన కూడా పరాజయం పాలయ్యారు. తిరిగి కాంగ్రెసులో చేరడానికి కిరణ్ రెడ్డి సిద్దంగా లేరని అంటున్నారు. ప్రస్తుత తరుణంలో బిజెపిలో చేరడమే మంచిదని ఆయనకు సన్నిహితులు సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. బిజెపిలో చేరే విషయంపై చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
రాష్ట్ర విభజనలో బిజెపి పాత్ర కూడా ఉన్నందున ఆ పార్టీలో చేరేందుకు కిరణ్ రెడ్డి తొలుత విముఖత ప్రదర్శించారని అంటున్నారు. ఆయన సన్నిహతులు, సోదరులు సర్దిచెప్పడంతో ఆయన అందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు.
గుజరాత్కు చెందిన వ్యాపార వర్గాల ద్వారా గానీ కర్ణాటకకు చెందిన వర్గాల ద్వారా గానీ కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. బిజెపిలో చేరడం ద్వారా తిరిగి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.