లేని సోనియా, పిఎం ఫొటోలు: విభజనపై కిరణ్ ధిక్కారం
గుంటూరు: కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టును శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే ప్రారంభోత్సవ వేదికకు జై ఆంధ్రా ఉద్యమ నేత కాకాని వెంకటరత్నం పేరు పెట్టడం, వేదికపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫొటో గానీ లేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అధిష్టానంపై తిరుగుబాటు పూర్తి స్థాయిలో సిద్ధపడ్డారనే ప్రచారం సాగుతోంది.
ఈ ప్రారంభోత్సవ వేదికను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే సభగా ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణ లేదా ప్రత్యేక పార్టీ ఏదైనా పెట్టే ఆలోచనలను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. కొందరు కోస్తా కాంగ్రెస్ నేతలు మాత్రం కాంగ్రెస్ అధిష్టానంపై యుద్ధం చేసేందుకు ఈ ప్రారంభోత్సవాన్ని వేదికగా చేసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
ఇంకా ఆ వేదికలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఒక్క ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఫొటోనే ఉంది. అందులో మిగితా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన ఇతర మంత్రులు, నేతల ఫొటోలు లేకపోవడం గమనార్హం. సోనియా, ప్రధాని, రాహుల్ల ఫొటోలు పెట్టకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించినట్లేనని పలువురు కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోను కూడా వేదికలో ఏర్పాటు చేయడం గమనార్హం.
రాష్ట్ర విభజనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. ప్రారంభోత్సవాన్ని వేదికగా చేసుకొని కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా, పులిచింతల ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే కార్యక్రమానికి తెలంగాణ మీడియాకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించలేదు. వారిని రానీయడం లేదు కూడా. దీంతో తెలంగాణ మీడియా సంస్థలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.