జై సమైక్యాంధ్రకు తిరస్కరణ: కిరణ్ రెడ్డి ఏం చేస్తారు?
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని కొనసాగిస్తారా? లేదా? అనే చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో కిరణ్ స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసింది. కానీ ఒక్క సీటును కూడా గెల్చుకోలేకపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కాంగ్రెసు పార్టీని వీడి జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. తొలుత పార్టీ పెట్టాలని సూచించిన పలువురు ఆ తర్వాత ఆయనకు చేయిచ్చారు. సీమాంధ్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందు కోసం కిరణ్ తన నియోజకర్గంలో తన తమ్ముడిని నిలబెట్టారు. కానీ ఈ ఎన్నికల్లో తన తమ్ముడిని కూడా గెలిపించుకోలేకపోయారు. ప్రజలు జై సమైక్యాంధ్ర పార్టీని, కాంగ్రెసు పార్టీని మట్టి కరిపించారు.
దీంతో పార్టీ పైన కిరణ్ కుమార్ రెడ్డి పునరాలోచనలో పడ్డారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల అనంతరం కిరణ్ బెంగళూరులో కొన్ని రోజులు గడిపారు. ఆ తర్వాత హైదరాబాదుకు తిరిగి వచ్చారు. పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఈ భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. పార్టీలో విస్తృతస్థాయిలో చర్చించి ఏం చేయాలనే విషయమై ఆయన ఆలోచించనున్నారట. కిరణ్ పార్టీని మూసేస్తారా అని చర్చ సాగుతోంది.